చంద్రబాబు ఫార్ములానే రేవంత్‌ రెడ్డి ఫాలో అవుతారట!

Revanth Reddy Effect In AP?

తెలంగాణ శాసనసభ ఎన్నికలలో గెలిచి అధికారంలోకి రావాలని తహతహలాడుతున్న కాంగ్రెస్‌ పార్టీ, హడావుడిగా ఆరు గ్యారెంటీ పధకాలను ప్రకటించేసింది. కర్ణాటకలో కూడా ఇంచుమించు అవే పధకాలను ప్రకటించి ఎన్నికలలో గెలిచి అధికారంలోకి వచ్చింది. కానీ ఇప్పుడు ఆ పధకాలు తలకు మించిన భారంగా మారాయని, వాటి కోసం అభివృద్ధి పనులకు నిధులు కేటాయించలేకపోతున్నామని కర్ణాటకలో కాంగ్రెస్‌ మంత్రులే చెపుతున్నారు.

కనుక కర్ణాటకలో వాటిని అమలుచేయలేక చేతులెత్తేస్తున్నప్పుడు తెలంగాణలో ఎలా అమలుచేయగలరు? చేస్తారనే గ్యారెంటీ ఏమిటి?అని బిఆర్ఎస్ నేతల ప్రశ్నిస్తున్నారు.

ADVERTISEMENT

తాజాగా ప్రముఖ మీడియా సంస్థ ఇండియా టుడే నిర్వహించిన రౌండ్ టేబిల్ సమావేశంలో పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి పాల్గొన్నప్పుడు మళ్ళీ అదే ప్రశ్న అడిగారు.

దానికి రేవంత్‌ రెడ్డి సూటిగా సమాధానం చెప్పలేకపోయారు. కానీ ఆయన మరో ఆసక్తికరమైన విషయం చెప్పారు. ఏమంటే, హైదరాబాద్‌ రాచకొండ ప్రాంతంలో కొత్తగా మరో నగరాన్ని నిర్మిస్తామని చెప్పారు. దాని కోసం అమరావతి తరహాలో 50వేల ఏకరాలు ల్యాండ్ పూలింగ్ చేస్తామని రేవంత్‌ రెడ్డి చెప్పారు. దానిని ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్మిస్తామని చెప్పారు. దాంతో భారీగా యువతకు ఉద్యోగాలు, ఉపాది లభిస్తాయని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని అమరావతి కోసం ఆనాడు చంద్రబాబు నాయుడు 33 వేల ఎకరాలు, ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించేందుకు సిద్దపడితే చాలామంది ఎద్దేవా చేశారు. అమరావతికి అంత భూమి అవసరమా?ల్యాండ్ పూలింగ్ ద్వారా అంత భూమి సేకరించడం సాధ్యమా? అంటూ ప్రశ్నించారు. అవసరమే… సాధ్యమే అని చంద్రబాబు నాయుడు నిరూపించారు.

ఇప్పుడు రేవంత్‌ రెడ్డి కూడా చంద్రబాబు నాయుడు ఫార్ములా ప్రకారమే ల్యాండ్ పూలింగ్ ద్వారా భూమి సేకరించి మరో నగరం నిర్మిస్తామని చెపుతున్నారు. అంటే చంద్రబాబు నాయుడు ఆలోచన, నిర్ణయం రెండూ సరైనవే అని స్పష్టమవుతోంది. పొరుగు రాష్ట్రాలలో పార్టీలకు, వాటి నాయకులకు చంద్రబాబు నాయుడు ఆలోచన గొప్పదని అర్దమైంది కానీ మనోళ్ళకే అర్దం కాలేదు. అందుకే నేటికీ దేశంలో రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ మిగిలిపోయింది.

ADVERTISEMENT
Latest Stories