జగన్‌ ఓ చచ్చిన పాము… పట్టించుకోనక్కరలేదు

Revanth Reddy Jagan Chandrababu Naidu

తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డి ఏపీలో వైసీపి ఓటమి, జగన్మోహన్‌ రెడ్డిపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. “ప్రజలు మనల్ని పాలన కోసం, అభివృధ్ది కోసం ఎన్నుకుని అధికారం కట్టబెడతారు తప్ప పగలు ప్రతీకారాలు తీర్చుకునేందుకు కాదు. కానీ జగన్మోహన్‌ రెడ్డి ఇది గ్రహించకపోవడం వలన ప్రజలు ఆయనను గద్దె దించేశారు.

హైదరాబాద్‌లో ఆయన ఇంటి ముందు షెడ్లు కూల్చాల్సిన అవసరం మా ప్రభుత్వానికి లేదు. అసలు ఆ విషయం నా దృష్టికి రాలేదు కూడా. రాగానే అత్యుత్సాహం ప్రదర్శించిన ఆ అధికారిని బదిలీ చేశాను.

ADVERTISEMENT

జగన్‌ ఓ చచ్చినపాము వంటివారు. కనుక ఆయన ఇంటి ముందు షెడ్లు కూల్చాల్సిన అవసరం మాకు లేదు. నాకు, చంద్రబాబు నాయుడుకి ఇంతకంటే చాలా ముఖ్యమైన పనులే ఉన్నాయి. ఇలాంటి పనికిమాలిన పనుల కోసం ఆలోచించే సమయం కూడా మాకు లేదు. ఈ విషయంలో వైసీపి నేతలు రాజకీయాలు చేయడం మానుకుంటే మంచిది.

హైదరాబాద్‌కు అమరావతి పోటీ అని నేను అనుకోవడం లేదు. కానీ అభివృద్ధిలో రెండు నగరాలు పోటీ పడితే నేను స్వాగతిస్తాను. అమరావతి అభివృద్ధి చెందితే హైదరాబాద్‌ నుంచి పరిశ్రమలు, ఐ‌టి కంపెనీలు అక్కడికి తరలిపోతాయని నేను భావించడం లేదు,” అని సిఎం రేవంత్‌ రెడ్డి అన్నారు.

రేవంత్‌ రెడ్డి చెప్పింది అక్షరాలా నిజమని అందరికీ తెలుసు. జగన్‌ పాలనలో వేధింపులకు గురైన టిడిపి నేతలు వైసీపి నేతలపై ప్రతీకారం తీర్చుకోవాలని రగిలిపోతున్నా చంద్రబాబు నాయుడు వారిని కట్టడి చేస్తున్నారు. లేకుంటే కొడాలి నాని హెచ్చరించిన్నట్లు నేడు ఆంధ్రాలో శాంతి భద్రతల సమస్య ఏర్పడి ఉండేది.

జగన్‌ తాను ఓ ముఖ్యమంత్రిననే విషయం కూడా మరిచిపోయి, మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వేంకటేశ్వర రావుని ఎంతగా వేధించారో అందరూ చూశారు.

కానీ చంద్రబాబు నాయుడు మాత్రం ఓ ముఖ్యమంత్రిగా తన ప్రభుత్వంలో పనిచేస్తున్న అధికారుల పట్ల మానవతా దృక్పదం ప్రదర్శించారు. జగన్‌కు వీర విధేయులైన మాజీ సీఎస్ జవహర్ రెడ్డిని, పూనం మాలకొండయ్య ఇద్దరూ నెలాఖరుకి పదవీ విరమణ చేయబోతున్నారు. కనుక వారిద్దరికీ మళ్ళీ పోస్టింగ్ ఇచ్చి వారు సగౌరవంగా పదవీ విరమణ చేసేందుకు అవకాశం కల్పించారు.

అమరావతి గురించి రేవంత్‌ రెడ్డి చెప్పిన విషయం కూడా ఆలోచించదగ్గదే. అమరావతి అభివృద్ధి చెందితే హైదరాబాద్‌ నష్టపోతుందనే దురాలోచనతోనే మూడు రాజధానులు అంటూ పిచ్చి ప్రతిపాదన చేస్తున్న జగన్‌కు కేసీఆర్‌ మద్దతు ఇచ్చి 2019 ఎన్నికలలో చంద్రబాబు నాయుడు ఓడిపోయేలా చేశారు.

కానీ వయసులో, అనుభవంలో కేసీఆర్‌, చంద్రబాబు నాయుడు కంటే చిన్నవాడైన రేవంత్‌ రెడ్డి కేసీఆర్‌లాగా సంకుచిత మనస్తత్వంతో ఆలోచించలేదు. రెండు నగరాలు అభివృద్ధి చెందాలి. అభివృధ్దిలో పోటీ పడాలని కోరుకోవడం చాలా అభినందనీయం.

ఆనాడు 2014లో చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు అభివృద్ధిలో పోటీ పడదామని కేసీఆర్‌కి సూచిస్తే ఆయన పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు రేవంత్‌ రెడ్డి ఇంత విజ్ఞతతో ఆలోచిస్తున్నారు. మాట్లాడుతున్నారు. ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రుల ఆలోచనలు, విధానాలతో రెండు తెలుగు రాష్ట్రాలకు తప్పకుండా చాలా మేలు జరుగుతుంది.

ADVERTISEMENT
Latest Stories