మాజీ సిఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో ఎంతగానో అభివృద్ధి చెందింది. ఇది కళ్ళకు కనిపిస్తున్న సత్యం. అయితే ఆ అభివృద్ధి వెనుక అప్పులు, అవినీతి మేటలు వేసిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూనే ఉంది.
ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలోకి రాగానే సిఎం రేవంత్ రెడ్డి ముందుగా విద్యుత్ శాఖపై నిన్న సమీక్షా సమావేశం జరిపారు. ఈ సమావేశంలో ఆ శాఖ ఉన్నతాధికారులు తమ విద్యుత్ సంస్థలు ఎంత అప్పులు పాలైపోయాయో, ఎంతగా నష్టపోతున్నాయో, వాటితో ఏవిదంగా మునిగిపోతున్నాయో పవర్ పాయింట్ ప్రజంటేషన్ పిక్చర్ వేసి మరీ చూపించి వివరించారు.
వారి లెక్కల ప్రకారమే తెలంగాణ విద్యుత్ సంస్థలకు రూ.85,516 కోట్లు అప్పులు పేరుకుపోయాయి. ఆదాయ వ్యయాలలో భారీ తేడా వలన నెలకు సుమారు రూ. 1,004 కోట్లు నష్టపోతున్నాయి. ఇక చేసిన అప్పులకు వడ్డీలకు నెలకు మరో రూ. 1,000 కోట్లు వరకు పోతోంది. సింగరేణికి జెన్ కో చెల్లించాల్సిన బకాయిలు రూ.6,800 కోట్లు అని తేల్చి చెప్పారు.
అంటే తెలంగాణ 24 గంటల విద్యుత్ సరఫరాతో ధగధగా వెలిగిపోతోందని కేసీఆర్ చెప్పుకొనేందుకు మూల్యం రూ.85,516 కోట్లు అన్న మాట! ఒక్క విద్యుత్ శాఖ అప్పులే ఇన్నివేల కోట్లు ఉంటే, కాళేశ్వరంతో సహా అనేక భారీ ప్రాజెక్టులు కట్టిన సాగునీటి శాఖ, రోడ్లు భవనాలు, వ్యవసాయ తదితర శాఖలపై ఇంకెన్ని వేలకోట్లు అప్పులు ఉన్నాయో త్వరలోనే తెలుస్తుంది.
అయితే ఈ అప్పులకు కేసీఆర్ వద్ద ‘అభివృద్ధి కోసం’ అనే సమాధానం సిద్దంగా ఉంది. అది కళ్ళకు కనిపిస్తోంది కూడా. కానీ అసలు అభివృద్ధి ఊసే ఎత్తకుండా లక్షల కోట్లు అప్పులు తెచ్చేసి పప్పు బెల్లాలలాగ పంచిపెట్టేస్తున్న జగన్ ప్రభుత్వాన్ని కూడా రేపు లెక్కలు తీస్తే ఏమని సమాధానం చెప్పుకోగలదు?
అభివృద్ధి కోసం కేసీఆర్ ప్రభుత్వం చేసిన లక్షల కోట్లతో ధనిక రాష్ట్రమైన తెలంగాణ అప్పుల ఊబిలో మునిగిపోతున్నప్పుడు, అసలు రాజధాని, పరిశ్రమలు, ఐటి కంపెనీలు, ఆదాయమే లేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిస్థితి ఏమిటి?అసలు జగన్ ప్రభుత్వం చేసిన అప్పులు ఎంత?వాటిని ఎవరు తీరుస్తారు? ఎప్పుడు తీరుస్తారు?ఎలా తీరుస్తారు?
ఈ సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాట ఒకటి గుర్తు చేసుకోక తప్పదు. ప్రభుత్వం మారగానే వివిద ప్రభుత్వ సంస్థల చైర్మన్లు, డైరెక్టర్లు రాజీనామాలు చేసి చేతులు దులుపుకొని వెళ్ళిపోతామంటే కుదరదు. వారు ప్రభుత్వానికి సంజాయిషీ, లెక్కలు అప్పగించి మరీ వెళ్ళాల్సి ఉంటుంది,” అని అన్నారు.
రేపు ఏపీలో కూడా ప్రభుత్వం మారితే సరిగ్గా ఇలాగే జరుగబోతోంది. కనుక అధికారులు తస్మాత్ జాగ్రత్త!




