రేవంత్ రెడ్డి ట్రంప్‌లాగే మాట్లాడుతున్నారే…

Revanth Reddy Speech Telangana Assembly

భారత్‌-పాక్‌ యుద్ధాన్ని నేనే ఆపానని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ పదేపదే చెప్పుకున్నారు. ఒకవేళ నిజంగానే ఆపి ఉంటే, దౌత్యనీతి ప్రకారం ఆవిషయం బయట పెట్టకూడదు. భారత్‌ ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించకూడదు. కానీ ఆ గౌరవం కంటే ఈ క్రెడిట్ ముఖ్యమనుకున్నారు. కనుక భారత్‌ ఆయన వ్యాఖ్యలను ఖండించక తప్పలేదు.

‘ఆపరేషన్ సింధూర్’ భారత్‌ శక్తిసామర్ధ్యాలు యావత్ ప్రపంచం గుర్తించేలా చేసిన ప్రధాని మోడీ, ట్రంప్ దుందుడుకు వ్యాఖ్యల వలన దేశంలో విపక్షాల ముందు తలదించుకోవలసి వచ్చింది. ట్రంప్ వ్యాఖ్యల తర్వాత కాంగ్రెస్‌, మిత్రపక్షాలు, దేశంలో మేధావులు మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మొదలుపెట్టిన సంగతి తెలిసిందే.

ADVERTISEMENT

ఇప్పుడు తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి కూడా అచ్చం ట్రంప్‌లాగే మాట్లాడి ఏపీ ప్రభుత్వానికి, సిఎం చంద్రబాబు నాయుడుకి సరిగ్గా అటువంటి ఇబ్బందే సృష్టించారు.

సిఎం రేవంత్ రెడ్డి నిన్న శాసనసభలో మాట్లాడుతూ, “నేను సిఎం చంద్రబాబు నాయుడుని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నిలిపివేయాలని అడిగాను. దానిని ఆపేస్తేనే నదీ జలాల విషయంలో మీతో చర్చకు వస్తాం లేకుంటే లేదని తెగేసి చెప్పాను.

ఆ ప్రాజెక్టుతో 3 టీఎంసీల నీళ్ళు దోచుకోవాలని ఏపీ ప్రభుత్వం అనుకుంటే నేను ఆయనపై, కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఆపించేశాను. ఆయన నా మీద గౌరవంతో ఆ ప్రాజెక్టుని ఆపేశారు. రెండు రాష్ట్రాల మద్య సంబంధాలు బాగుండాలనే ఉద్దేశ్యంతో ఇంత వరకు ఈ విషయం నేను బయటపెట్టలేదు,” అని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు.

సిఎం రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై వైసీపీ కూటమి ప్రభుత్వాన్ని నిలదీయకుండా ఉండదు. సిఎం రేవంత్ రెడ్డి ఒత్తిడి చేయగానే తమ హయంలో మొదలుపెట్టిన ఈ ప్రాజెక్టుని సిఎం చంద్రబాబు నాయుడు నిలిపివేశారని ఆరోపిస్తుంది.

చంద్రబాబు నాయుడుతో రేవంత్ రెడ్డితో కుమ్మక్కయ్యి తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలిగిస్తున్నారని అక్కడ బీఆర్ఎస్‌ పార్టీ విమర్శిస్తోంది.

ఇప్పుడు ఇక్కడ వైసీపీ కూడా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డితో కుమ్మక్కయ్యి ఏపీ ప్రయోజనాలకు భంగం కలిగించారని ఆరోపించకుండా ఉంటుందా?

తనపై గౌరవంతో సిఎం చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టు నిలిపివేశారని రేవంత్ రెడ్డి తెలంగాణ శాసనసభలో కుండ బద్దలు కొట్టినట్లు చాలా స్పష్టంగా చెప్పారు. కానీ ప్రాజెక్టుల విషయంలో బీఆర్ఎస్‌ పార్టీపై పైచేయి సాధించాలనే తాపత్రయంలో తనని గౌరవించిన సిఎం చంద్రబాబు నాయుడుకి ఇబ్బంది కలిగించేవిధంగా మాట్లాడారు కదా?

భారత్‌-పాక్‌ యుద్ధాన్ని నేనే ఆపానని ట్రంప్‌ చెప్పుకుంటుంటే కాదని భారత్‌ ప్రభుత్వం ఖండించినట్లుగానే, ఇప్పుడు ఈ వ్యవహారంలో రేవంత్ రెడ్డి మాటలను కూటమి ప్రభుత్వం ఖండించగలదా?

ఈ ప్రాజెక్టు విషయంలో వైసీపీ నిందిస్తుంటే సిఎం చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వం తలదించుకోవాలి.. సంజాయిషీలు ఇచ్చుకోక తప్పదు కదా?

ADVERTISEMENT
Latest Stories