విజనరీ సీఎంగా బాబు, సంక్షేమ నాయకుడిగా వైఎస్ఆర్, ఉద్యమ నేతగా కేసీఆర్, ఇలా ముగ్గురు ముఖ్యమంత్రులు కూడా పాలనలో తమ తమ మార్క్ చూపిస్తూ ప్రజలకు దగ్గరయ్యారు.
అయితే గత ఐదేళ్ల అధికారంతో బటన్ నొక్కే సీఎం గా, పరదాల పెద్దమనిషిగా జగన్ కూడా ఒక ప్రత్యక గుర్తింపు సాధించారు. ఇక 2023 ఎన్నికలలో అనూహ్య విజయం తో తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ తరువాత రెండవ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న రేవంత్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర్ర పూర్తి చేసుకున్నప్పటికీ తన మార్క్ పాలన చూపించలేకపోయారు.
హైడ్రా చర్యలతో బుల్డోజర్ సీఎం గా,కూల్చివేతల నాయకుడిగా విమర్శలు ఎదుర్కుంటున్న రేవంత్ రెడ్డి తొలిసారిగా పాలన లో తన మార్క్ చూపే ప్రయత్నం చేస్తున్నారు. అందుకు సాక్షులుగా మహిళలను ఎంచుకోవడం ఇక్కడ మరో ప్రత్యేకతగా చెప్పవచ్చు.
రాజేంద్ర నగర్ లోని ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయంలో జరిగిన వన మహోత్సవంలో పాల్గొన్న రేవంత్ ప్రతి తల్లి తన ఇంట్లో రెండు మొక్కలను నాటాలని, వాటిని కూడా తమ పిల్లలుగా భావించి పెంచాలంటూ పిలుపునిచ్చారు.
మహిళలను కోటేశ్వరులుగా చేయడమే తమ ప్రభుత్వ ధ్యేయమని,అందులో భాగంగానే ఇందిరా శక్తి క్యాంటిన్లను మహిళలకు కేటాయించడం జరిగిందని, అలాగే రాజకీయలలో కూడా మహిళల ప్రాధాన్యత పెరగాలని ఆ దిశగా తానూ అడుగులు వేస్తానంటూ హామీ ఇచ్చారు.
గత పదేళ్ల బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క మహిళా మంత్రి కూడా లేకపోవడాన్ని ఎత్తి చూపిన రేవంత్ తన ప్రభుత్వంలో మంత్రులుగా మహిళలకు స్థానం కల్పించిన సంగతి వివరించారు. అలాగే భవిష్యత్ లో జరగబోయే ఎన్నికలలో 153 సీట్లలో మహిళలకు కేటాయించిన 33% రిజర్వేషన్ అమలు చేస్తూనే,
దానికి అదనంగా మరో పది సీట్లు కలిపి మొత్తం 60 ఎమ్మెల్యే సీట్లను మహిళలకు కలిపించడంతో పాటు వారిని గెలిపించే పూర్తి బాధ్యతను కూడా తానే తీసుకుంటా అంటూ రేవంత్ రెడ్డి మహిళలకు హామీ ఇచ్చారు.
ఈ హామీ అమలు సాధ్యమైతే రేవంత్ రెడ్డి కూడా తన పాలనలో ఒక మంచి మార్పు దిశగా అడుగులు వేసిన తొలి ముఖ్యమంత్రిగా పేరు దక్కించుకుంటారు. అలాగే తోటి రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా ఆదర్శంగా నిలుస్తారు.




