ఐపీఎల్ సీజన్ 10లో భాగంగా ఆడిన తొలి మ్యాచ్ లోనే పూణే చేతిలో ఓటమి చవిచూసిన ముంబై ఇండియన్స్, ఆ తర్వాత వరుసగా ఆరు విజయాలు సొంతం చేసుకుని పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంలో నిలిచింది. అయితే రెండో రౌండ్ లో భాగంగా మళ్ళీ పూణేతో తలపడ్డ ముంబై ఇండియన్స్ కు భంగపాటు తప్పలేదు. ఈ విజయంతో పూణే జట్టు టాప్ 4లోకి ప్రవేశించింది. ఈ ఓటమి వలన ముంబై ఇండియన్స్ పెద్దగా నష్టం లేనప్పటికీ, వరుస విజయాలకు బ్రేకులు పడ్డట్లయ్యింది.
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబైకు పూణే ఓపెనర్లు గట్టిగానే బదులిచ్చారు. రెహానే – త్రిపాఠిల జోడి తొలి వికెట్ కు ఏకంగా 76 పరుగులు జోడించడంతో, ముంబై ముందు భారీ లక్ష్యం ఖరారైంది. అయితే ఆ తర్వాత ముంబై బౌలర్లు రాణించడంతో పూణే దూకుడుకు అడ్డుకట్ట పడింది. దీంతో 160 పరుగుల గౌరవప్రదమైన స్కోర్ ను నమోదు చేయగలిగింది పూణే. రెహానే 38, త్రిపాఠి 45 పరుగులతో రాణించగా, చివర్లో మనోజ్ తివారీ 22 పరుగులతో సత్తా చాటాడు.
ఇక, లక్ష్య చేదనను గ్రాండ్ గా ఆరంభించిన ముంబై, దానిని నిలబెట్టుకోవడంలో విఫలమైంది. బట్లర్ ఔటైన తర్వాత ఫాంలో ఉన్న రానా పేలవమైన షాట్ కొట్టి అవుట్ కాగా, ఆ కాసేపటికే పార్థీవ్ పటేల్ 33 కూడా వెనుదిరిగాడు. దీంతో 60 పరుగులకే 3 టాప్ ఆర్డర్ వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ముంబైను కెప్టెన్ రోహిత్ శర్మ ఆదుకున్నాడు. ఒక దశలో మ్యాచ్ చేజారిపోతున్న నేపధ్యంలో భారీ షాట్లు కొట్టి బరిలో నిలిపాడు. అయితే చివరి 4 ఓవర్లలో 39 పరుగులు చేయాల్సి ఉన్న తరుణంలో మ్యాచ్ మరో మలుపు తిరిగింది.
ఈ సమయంలో భారీ షాట్ కు ప్రయత్నించిన పొల్లార్డ్ అవుట్ అవ్వడంతో పాటు, తాహీర్ వేసిన ఓవర్లో కేవలం 4 పరుగులు మాత్రమే లభించాయి. అలాగే బెన్ స్టోక్స్ అద్భుతంగా వేసిన 19వ ఓవర్ లో కూడా 6 పరుగులు మాత్రమే లభించడంతో, ముంబై విజయానికి చివరి ఓవర్లో 17 పరుగులు చేయాల్సి వచ్చింది. చివరి ఓవర్ తొలి బంతికే హార్దిక్ పాండ్య వెనుదిరిగగా, రెండవ బంతిని సిక్సర్ గా మలిచి రోహిత్ ఊపునిచ్చాడు. అయితే జయదేవ్ వేసిన స్లో బాల్ కు రోహిత్ అవుట్ అవ్వడంతో, ముంబై ఆశలు నిర్జీవమయ్యాయి. చివరి బంతిని హర్భజన్ సిక్సర్ గా మలచగా, విజయానికి మరో 4 పరుగుల తేడాతో ముంబై నిలిచిపోయింది.



