ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీడియా ఎడిటర్ వేమూరి రాధాకృష్ణ గత వారం ప్రసారమైన ‘వీకెండ్ కామెంట్’లో ‘మావిగన్ రాజధాని’ అన్నందుకు వైసీపీ అధినేత జగన్ని, గుడ్డిగా ఆయనకు తానతందాన అంటునందుకు ఆ పార్టీ నేతలను ఆక్షేపిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. వాటితో జగన్ బాగా హర్ట్ అయ్యారు. కనుక వైసీపీ నేతలందరూ హైదరాబాద్ వెళ్ళి అక్కడ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం ఎదుట ఆందోళనలు చేశారు.
మాజీ మంత్రి రోజా అయితే ఆంధ్రజ్యోతి ఆఫీసులు తగులబెట్టేస్తామని హెచ్చరించగా, జగన్ స్పందిస్తూ, “మేము అధికారంలోకి రాగానే వేమూరిని ఏపీలో అన్ని పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పిస్తాము,” అని హెచ్చరించారు.
మర్నాడు ఏఎపీలోని ఆంధ్రజ్యోతి కార్యాలయాల ఎదుట ఆందోళనలు చేసిన వైసీపీ నేతలు, వేమూరి రాధాకృష్ణ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని వార్నింగ్ ఇచ్చారు.
ఇదంతా జరిగి వారం రోజులు కావస్తోంది. కనుక వేమూరి రాధాకృష్ణ మళ్ళీ మరో ‘వీకెండ్ కామెంట్’తో వైసీపీ నేతలని పలకరించడానికి సిద్ధమయ్యారు. నేడు సోషల్ మీడియాలో దాని టీజర్ వదిలారు. దానిలో వైసీపీని మరింత రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు.
“జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే చేయబోయే అరాచకాలకు టీజర్ వదులుతున్నారా? నా దమ్ము, ధైర్యం చూడాలని ఆరాటపడుతున్న వైసీపీ నేతలకు నేను వైఎస్సార్, కేసీఆర్లను ఏవిధంగా ఎదుర్కొని నిలబడ్డానో చూడలేదా?
శాసనసభలో చంద్రబాబు నాయుడు సతీమణిని, బయట పవన్ కళ్యాణ్ సతీమణిని, చివరికి నీ సొంత తల్లి, చెల్లిని కూడా అవమానించిన మీరు మహిళల గౌరవం గురించి మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లే ఉంటుంది.
వైసీపీ నేతల బుర్రల్లో కాస్త అయినా గుజ్జు ఉండి ఉంటే జగన్ రాజధాని పేరుతో ఇన్ని పిల్లి మొగ్గలు వేసేవాడా? జగన్కి ఎవరి సలహా అక్కరలేదంటే అతనో నియంత అని మీకు అర్థం కావడం లేదా?
సొంత మీడియా పెట్టుకొని ఇతర మీడియా సంస్థలపై పార్టీ నేతల చేత దాడులు చేయించాడాన్ని ఏవిధంగా సమర్ధించుకోగలరు?
సిఎం చంద్రబాబు నాయుడుని ఎదుర్కోలేక నా మీద పడ్డారా? నీ రక్త చరిత్రలో ఇంకా వెలుగు చూడని చీకటి కోణాలను బయటపెడితే నీ గంతేంటో ఆలోచించుకో జగన్,” అంటూ ‘వీకెండ్ కామెంట్ బై రాధాకృష్ణ’ టీజర్ వదిలారు.
వేమూరి రాధాకృష్ణ గురించి తెలిసినవారు ఆయన జగన్ హెచ్చరికలకు, వైసీపీ దాడులకు భయపడి క్షమాపణలు చెప్పే రకం కాదని ముందే చెప్పేశారు.
కనుక జగన్తో సహా వైసీపీ నేతలందరూ ఈరోజు రాత్రి 8.30 గంటలకు ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో ప్రసారం కాబోయే ‘వీకెండ్ కామెంట్ బై ఆర్కే’ చూసి, రేపటి నుంచి మళ్ళీ ఆందోళనలకు బయలుదేరుతారేమో?




