మాజీ మంత్రి రోజా నిన్న తిరుమల స్వామివారిని దర్శించుకున్న తర్వాత మళ్ళీ నోటికి పని చెప్పారు.
“మా జగనన్న, వదిన భారతమ్మ సంప్రాదాయ బద్దంగా ఉగాది వేడుకలు జరుపుకొని రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కానీ చంద్రబాబు నాయుడు ఎక్కడున్నారు? భువనేశ్వరి హెరిటేజ్ డెయిరీలో పాలు పితకడానికి వెళ్ళారా? ఉగాది రోజున ఇద్దరూ కలిసి ప్రజలకు శుభాకాంక్షలు చెప్పాలనే జ్ఞానం లేదా?
ఉగాది రోజున టిటిడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఎక్కడున్నాడు? తిరుమలలో ఉండాల్సిన అవసరం లేదా? ఎక్కడ గాడిదలు కాస్తున్నాడు?” అంటూ రోజా రెచ్చిపోయారు.
ఆమెకు టీడీపి నేతలు ధీటుగా జవాబు చెప్పారు కానీ అలాంటి వాటికి ఆమె అతీతురాలు కనుక దులిపేసుకొని ఉండవచ్చు.
కానీ ఆమె “చంద్రబాబు నాయుడు ఎక్కడ? ఫ్యామిలీతో ప్రజలకు కనపడాలి కదా?” అని అడిగిన ప్రశ్న ఆయనని కాక జగన్మోహన్ రెడ్డినే అడిగినట్లు అనిపించిందని పలువురు అభిప్రాయపడ్డారు.
ఎందుకంటే హిందూ ఓటు బ్యాంకు కోసం జగన్ గుళ్ళు, గోపురాలు తిరుగుతుంటారు… కానీ ఒంటరిగానే! అన్యమతస్థులు ఎవరూ యజ్ఞాలు, యాగాలు చేయరు. కానీ జగన్ చేస్తారు… హిందూ ఓటు బ్యాంకు కోసమే! హిందూ సాంప్రదాయం ప్రకారం భార్య లేకుండా యజ్ఞయాగాలు చేయకూడదు. అన్యమతస్తుడైన జగన్ ఇలాంటి పట్టింపులేవీ ఉండవు. కనుక ఒంటరిగానే చేస్తారు. చిత్తశుద్ధి లేని శివపూజలంటే ఇవే కదా?
కనుక సిఎం చంద్రబాబు నాయుడుని ఉద్దేశ్యించి “మీ ఫ్యామిలీ ఏది… ఎక్కడ?” అంటూ రోజా అడిగిన ప్రశ్న జగన్ని అడుగుతున్నట్లే అనిపించడం సహజమే.
కానీ చంద్రబాబు నాయుడు సకుటుంబ సమేతంగా తిరుమల పర్యటన ఇదివరకే ఖరారు అయిన సంగతి ఆమెకు తెలిసే ఉంటుంది. కానీ నోటికి వచ్చినట్లు మాట్లాడేశారు.
నేడు మనుమడు దేవాన్ష్ పుట్టిన రోజు సందర్భంగా చంద్రబాబు నాయుడు దంపతులు, నారా లోకేష్ దంపతులు ఆ పిల్లాడిని తీసుకొని తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తీర్ధ ప్రసాదాలు స్వీకరించి వెంగమాంబ అన్నప్రసాదా కేంద్రంలో భక్తులకు స్వయంగా భోజనాలు వడ్డించారు. దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా అన్నదానం కొరకు రూ.44 లక్షలు టిటిడీకి విరాళం ఇచ్చారు.
రోజా ఏ ఉద్దేశ్యంతో గ్రూప్ ఫోటో అడిగినప్పటికీ సిఎం చంద్రబాబు నాయుడు సకుటుంబ సమేతంగా వచ్చి గ్రూప్ ఫోటో దిగి ఆమె కోరిక తీర్చారు. హ్యాపీ?




