సినీ పరిశ్రమ నుంచి రాజకీయాలలోకి వచ్చిన అనేకమందిలో మంత్రి రోజా కూడా ఒకరు. ఆమె సినీ పరిశ్రమలో ఉన్నప్పుడు అందరు పెద్ద హీరోల పక్కన హీరోయిన్గా నటించి మెప్పించారు.
ఆమె సినీ పరిశ్రమలో నిలద్రొక్కుకొనేందుకు కొన్ని అశ్లీల చిత్రాలలో కూడా నటించారని ఆ సీడీలు తన దగ్గర భద్రంగా ఉన్నాయని టిడిపి సీనియర్ నేత బండారు సత్యనారాయణ మూర్తి సంచలన ఆరోపణలు చేయడం, అందుకు పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం అందరికీ తెలిసిందే.
పోలీసులు అర్దరాత్రి ఆయన ఇంటిని చుట్టుముట్టి అరెస్ట్ చేసినందుకు టిడిపి శ్రేణులు భగ్గుమంటున్నాయి. ప్రతిపక్ష నేతలందరినీ ప్రభుత్వం తప్పుడు కేసులతో అరెస్ట్ చేయిస్తూ వేధిస్తోందని టిడిపి శ్రేణులు ఆరోపించారు. కానీ ఎవరూ పోలీసులు బండారుని అరెస్ట్ చేయడానికి రోజాపై చేసిన సంచలన ఆరోపణల గురించి ప్రస్తావించలేదు.
అదే… వారు ‘ఆ సీడీల గురించి’ మాట్లాడి ఉండి ఉంటే మంత్రి రోజాకు ఇబ్బందికరంగా మారేది. కానీ అదృష్టవశాత్తు అలా జరగలేదు. కానీ ఆయనను అరెస్ట్ చేసిన తర్వాత మంత్రి రోజా మళ్ళీ మీడియా ముందుకు వచ్చి స్వయంగా ఆ సీడీల ప్రస్తావన చేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది.
మంగళవారం తిరుపతి గ్రామీణ మండలం చిగురువాడ వద్ద తన నివాసంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ, “నేను ఏదైనా మాట్లాడితే సినిమావాళ్ళమని టిడిపి నేతలు విమర్శిస్తుంటారు. వారి అధినేత ఎన్టీఆర్ కూడా సినీ నటుడే కదా?నేను టిడిపిలో ఉన్నప్పుడు పార్టీలో ఎవరికీ నాలో తప్పులు కనిపించలేదు. కానీ పార్టీతో విభేదించి బయటకు వచ్చేసినప్పటి నుంచి నేను చెడ్డదాన్ని అయిపోయాను. నేను శాసనసభకు వచ్చినప్పుడు అశ్లీల చిత్రాలలో నటించానంటూ ఏవో సీడీలు ప్రదర్శిస్తుంటారు. కానీ వాటిని ఎవరికీ ఇవ్వరు?అందరిలాగే సినీ పరిశ్రమలో ఎంతో కష్టపడి పైకి వచ్చాను. నా కుటుంబం కోసం రేయింబవళ్ళు ఎతో కష్టపడ్డాను తప్ప నేను ఏ తప్పు చేయలేదు. అయినా నా క్యారక్టర్ గురించి మాట్లాడటానికి వాళ్ళెవరు?” అని అన్నారు.
మంత్రి రోజా తాను బండారు చేసిన ఆరోపణలను ఖండిస్తున్నానని అనుకొన్నారే తప్ప టిడిపి వదిలేసిన ‘ఆ విషయం’ గురించి స్వయంగా మాట్లాడి, సామాన్య ప్రజలు కూడా దాని గురించి చర్చించుకొనేలా చేస్తున్నానని గ్రహించిన్నట్లు లేరు.



