తమిళనాడు ఎన్నికల ఫలితాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో చర్చనీయాంశాలుగా మారిపోయాయి. ముఖ్యంగా స్టాలిన్ ఓటమి పై విజయ్ గెలుపు పై వైసీపీ ద్వంద వాదనలు వినిపిస్తూ సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది.
నిన్నటి వరకు స్టాలిన్ కి మద్దతు పలికి డీఎంకే గెలుపు కోసం ఆరాటపడిన రోజా నేడు విజయ్ గెలుపుకి జగన్ ఫోటో కూడా ఒక కారణమంటూ వ్యాఖ్యానించడం, విజయ్ టీవీకే కు మద్దతు ప్రకటించడంతో ఇప్పుడు రోజా పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
విజయ్ తన ఎన్నికల ప్రచారంలో జగన్ ఫోటో ను పట్టుకున్నారని, అది ఆయన టీవీకే పార్టీకి రాజకీయంగా కలిసొచ్చిందన్నారు. అలాగే విజయ్ మొదటి నుంచి కూడా వైస్ జగన్ ను ఫాలో అవుతున్నారని, అందుకే పొత్తులకు నో చెప్పి సింహం సింగల్ అనేలా ఎన్నికల బరిలోకి దిగారన్నారు.
జగన్ తో విజయ్ కి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, అటువంటి వారికీ వైసీపీ మద్దతు ఖచ్చితంగా ఉంటుందంటూ విజయ్ టీవీకే గెలుపులో వైసీపీ ‘క్రెడిట్ చోరీ’కి యత్నిస్తుంది. రోజా చెపుతున్నట్టుగా విజయ్ తన ఎన్నికల ప్రచారంలో జగన్ ఫోటోను పట్టుకుంటేనే టీవీకే పార్టీకి 108 సీట్లు వస్తే మరి 2024 ఎన్నికలలో వైసీపీ పోటీ చేసిన 175 స్థానాలలో వైసీపీ నేతలందరూ జగన్ ఫోటోనే పట్టుకున్నారుగా.
మరి అందులో వైసీపీ కేవలం 11 స్థానాలలో మాత్రమే విజయం ఎందుకు సాధించినట్టు.? మిగిలిన 164 నియోజకవర్గాలలోని ప్రజలు జగన్ ఫోటోను చూసే వైసీపీ ని ఓడించారా.? జగన్ రాజకీయ ప్రభావం కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అన్న వాస్తవాన్ని మరిచి పోయి వైసీపీ నేతలు ఏ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ విజయం సాధించినా ఆ పార్టీ అధినేత ను జగన్ సన్నిహితుడిగా చిత్రీకరిస్తూ వారి గెలుపులో వైసీపీ క్రెడిట్ చోరీకి పాల్పడుతుంది.
నాడు బిఆర్ఎస్ ఓటమిలో కూడా వైసీపీ పాత్ర ఉందంటే ఈ సోకాల్డ్ వైసీపీ నేతలు అంగీకరిస్తారా.? అలాంటిది నేడు విజయ్ గెలుపు లో మాత్రం జగన్ ను బలవంతంగా ఎందుకు ఇరికిస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం.? ఏపీలో జగన్ ఛరిష్మాతో గెలువలేని వైసీపీ తమిళనాడు లో మాత్రం జగన్ ఫోటో తో టీవీకే గెలుపు దిశగా వెళ్లగలిగిందని ఎలా చెప్పగలదు.? ఇది క్రెడిట్ చోరీ కాదా.?
ఇటువంటి వ్యాఖ్యలు ఒకరి కష్టాన్ని, శ్రమని దోచుకోవడం కిందకు రావా.? ఈ రకమైన రాజకీయ ప్రకటనలు వైసీపీ ని ప్రజల ముందు మరింత దిగజారేలా చేస్తాయి. రాజకీయాలలో గెలుపోటములు సర్వ సాధారణం. తానూ, తన వాడు గెలిస్తే అది చరిత్ర అని తన ప్రత్యర్థి గెలిస్తే అది ఈవీఎంల చీటింగ్ అని, గెలిచిన ప్రతి వాడిని సన్నిహితుడని, ఓడినవాడిని ప్రత్యర్థని రోజుకో మాట, పూటకో పార్టీకి మద్దతు పలికితే చివరికి వైసీపీ నేతల మాటలకు విలువుంటుందా.?




