తెలుగుదేశం పార్టీ నేతలపై విరుచుకుపడే రోజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా కూడా నందమూరి బాలకృష్ణ నుండి నారా లోకేష్ వరకు దాదాపుగా అందరి ముఖ్య నేతలపై రోజా అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే గత అసెంబ్లీ సమావేశాల సమయంలో రోజా చేసిన అసభ్యకర వ్యాఖ్యలకు చర్యలుగా ప్రభుత్వం ఒక ఏడాది పాటు అసెంబ్లీ నుండి బహిష్కరించినా, రోజా నోటికి తాళం మాత్రం వేయలేకపోయింది బాబు సర్కార్.
తాజాగా దీనిపై స్పందించిన టిడిపి నేత, ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి… వైసీపీ ఎమ్మెల్యే రోజాపై విధించిన ఏడాది సస్పెన్షన్ ను ఐదేళ్లకు పెంచాలని డిమాండ్ చేశారు. అంతే కాకుండా, తమ పార్టీ అధినేత, ఎమ్మెల్యేలను బెదిరించేలా వ్యాఖ్యలు చేసిన రోజాపై రౌడీ షీట్ తెరవాలని, ఒక బజారు రౌడీ మాదిరి రోజా మాట్లాడుతోందని, మహిళలే తలదించుకునేలా ప్రవర్తిస్తోందని, బాలకృష్ణ మాట్లాడిన వ్యాఖ్యలను తప్పు పట్టిన రోజాకు సంబంధించి ఇంటర్నెట్ లో బోలెడు హాట్ వీడియోలు ఉన్నాయని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.



