తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మె మొదలుపెట్టినప్పుడు చాలా మంది నాడు కేసీఆర్ సిఎంగా ఉన్నప్పుడు జరిగిన 55 రోజుల సమ్మెని గుర్తు చేసుకుంటున్నారు. కార్మికుల డిమాండ్లలో ఏ ఒక్కదానికి కేసీఆర్ అంగీకరించకుండా మొండికేయడమే కాకుండా ‘ఆర్టీసీని మూసేస్తా.. కార్మికులు రోడ్డున పడి అడుక్కు తింటారు,’ అంటూ చాలా అహంకారంగా మాట్లాడారు.
55 రోజులు నిరవధిక సమ్మె కారణంగా జీతాలు రాక, చేతిలో సొమ్ము లేక, అప్పిచ్చే నాధుడు లేక కుటుంబ పోషణ చేయలేక నిజంగానే చాలా మంది రోడ్డున పడ్డారు.
ఈ ఆర్ధిక, ఆరోగ్య సమస్యలతో కొందరు, కేసీఆర్ నిరంకుశ, అహంకారపు మాటలతో ఆందోళన చెంది కొందరు గుండెపోటు, ఆత్మహత్యలతో చనిపోయారు. అయినా కేసీఆర్ మనసు కరుగలేదు.
చివరికి ఆర్టీసీ కార్మికులు బేషరతుగా అన్ని డిమాండ్స్ వదులుకొని మళ్ళీ ఉద్యోగాలలోకి తీసుకుంటే చాలని వేడుకునే పరిస్థితి కల్పించారు కేసీఆర్. ఆర్టీసీ కార్మికులు కాళ్ళపై పడితేగానీ కేసీఆర్ అహం శాంతించలేదు.
అప్పుడు వారిని ప్రగతి భవన్కు పిలిచి భోజనాలు పెట్టి జీతాలు పెంచారు. ఇదే పని ముందే చేస్తే సమ్మె చేసేవారే కాదు కదా? అంటే ఆర్టీసీ కార్మికులకి తన తడాఖా చూపాలనుకున్నారు చూపించారని అనుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత కేసీఆర్ పదవిలో ఉన్నంత కాలం ఆర్టీసీ కార్మికులు సమ్మె సాహసం చేయలేదు.
నాడు కేసీఆర్ ఆవిధంగా వ్యవహరిస్తుంటే, సుమారు 40,000 మంది ఆర్టీసీ కార్మికులు, వారి కుటుంబాలు రోడ్డున పడుతుంటే, కార్మికులు ప్రాణాలు కోల్పోతుంటే కేటీఆర్, కవిత, హరీష్ రావు ఏ ఒక్కరూ కలుగజేసుకోలేదు. ఎవరూ కేసీఆర్కి ఇది తప్పని చెప్పలేదు.
నాడు ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డి, కాంగ్రెస్, బిజేపి నేతలూ వారికి సంఘీభావం ప్రకటించి కేసీఆర్ని తప్పు పట్టారు. కానీ ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు తక్షణం సమ్మె విరమించి విధులకు హాజరు కావాలని కాంగ్రెస్ మంత్రులు సూచిస్తున్నారు!
ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు సమ్మెకు బీఆర్ఎస్ పార్టీ నేతలు వారికి సంఘీభావం ప్రకటిస్తున్నారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్ ప్రభుత్వం తీరుని తప్పు పట్టారు. ఆర్టీసీ కార్మికులకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉందని, ప్రభుత్వంతో పోరాడుతుందని అన్నారు. కనుక వారిని బీఆర్ఎస్ పార్టీ నేతలే సమ్మెకు ఉసిగొల్పుతున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.
ఇప్పుడు మొత్తం కలిపి చూస్తే ప్రభుత్వాలు మారినా ఆర్టీసీ కార్మికుల పరిస్థితి మాత్రం మారలేదని, అలాగే అధికార, ప్రతిపక్షాల రాజకీయ చదరంగంలో ఆర్టీసీ కార్మికులు కేవలం పావులుగా మిగిలిపోతారని అర్ధమవుతోంది.




