రాజకీయ నాయకులు ఎన్నికలకు ముందు, ఓటమి తర్వాత పార్టీలు మారుతుండటం సర్వసాధారణమే. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే జరుగుతోంది. శాసనసభ ఎన్నికలలో ఘోరంగా ఓడిపోయిన తర్వాత ఆ పార్టీ నేతల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. సాధారణ రాజకీయాలలోనైతే ఇదేం పెద్ద సమస్య కాదు. గెలిచిన పార్టీలోకి జంప్ అయిపోవచ్చు.
కానీ గత 5 ఏళ్ళుగా వైసీపి అధినేత జగన్మోహన్ రెడ్డితో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు టిడిపి, జనసేన అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లను ఎంతగా అవహేళన చేశారో… ఆ రెండు పార్టీల నేతలను, కార్యకర్తలను ఎంతగా వేధించారో… ఎన్ని కేసులు పెట్టారో అందరికీ తెలుసు.
కనుక వారికి ఆ రెండు పార్టీల తలుపులు మూసుకుపోయిన్నట్లే… అందరికీ జైలు తలుపులు తెరుచుకున్నట్లే అని అందరూ అనుకున్నారు. ఆ పార్టీ నేతలు కూడా అదే అనుకున్నారు. ఆ భయంతోనే కొందరు రాజకీయ సన్యాసం చేయగా మరికొందరు రాజకీయంగా పూర్తిగా సైలంట్ అయిపోయారు.
కొందరు వైసీపి నేతలు వేరే గత్యంతరం లేక జగన్ భజన చేస్తూ కాలక్షేపం చేస్తుండగా. మిగిలినవారు ఒకరొకరుగా జనసేన నేతలని సంప్రదిస్తూ వారి ద్వారా పవన్ కళ్యాణ్ని ఒప్పించుకొని ఆ పార్టీలో చేరుతున్నారు. మాజీ ఎంపీ బాలినేని శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఇందుకు నిదర్శనంగా కనబడుతున్నారు.
తాజాగా మరొక సీనియర్ నేత వైసీపికి గుడ్ బై చెప్పేసి జనసేనలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు సమాచారం.
ఆ వ్యక్తి మరెవరో కాదు. జగన్మోహన్ రెడ్డికి వీర విధేయులలో ఒకరిగా పేరొందిన మాజీ మంత్రి అనిల్ కుమార్. ఇప్పటికే జనసేన నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే చేరిపోయేందుకు సిద్దంగా ఉన్నట్లు సమాచారం.
మాజీ మహిళా కమీషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఇటీవలే వైసీపికి రాజీనామా చేసి, జగన్ని నాలుగు తిట్లు జనసేనలో చేరేందుకు ‘క్వాలిఫికేషన్’ సంపాదించుకున్నారు.
అనిల్ కుమార్ కూడా ఇదే పద్దతిలో ‘క్వాలిఫై’ అయ్యి జనసేనలో చేరిపోయినా ఆశ్చర్యం లేదు. అంటే వైసీపి నేతలకి ప్రత్యామ్నాయం దొరికిందన్న మాట! అది జనసేన కావడమే చాలా బాధాకరం!




