కూటమిని చుట్టుముడుతున్న వివాదాలు…

Sai Krishna Controversy Raises Questions for AP Govt

నిన్నటి వరకు మెగా డీఎస్సి లో స్కాం అంటూ వైసీపీ కూటమి ప్రభుత్వం పై విరుచుకుపడింది. అర్హత లేని వారికీ ఉద్యోగాలిచ్చారని, డిఎస్సి పేపర్ లీక్ అయ్యిందని, ఉద్యోగాల నియమాలలో భారీ అవినీతి జరిగిందని వైసీపీ నానా హంగామా చేసింది.

అయితే నిన్నటి వరకు కూడా కూటమి ప్రభుత్వం పై వైసీపీ చేస్తున్న ఈ ఆరోపణల మీద ప్రభుత్వం కేవలం వివరణకు మాత్రమే పరిమితమయ్యింది. కానీ నేడు లోకేష్ సవాల్ తో డీఎస్సి వివాదానికి ఒక ఎండ్ కార్డు పడినట్లుగా భావించవచ్చు.

ADVERTISEMENT

అయితే ఒక వివాదం తొలిగితే మరో వివాదం అన్నట్టుగా ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని సాయి కృష్ణ వివాదం చుట్టుముడుతుంది. విజయవాడ కృష్ణలంకకు సంబంధించిన 23 ఏళ్ళ గాదె సాయి కృష్ణ అనే కాపు సామాజికవర్గానికి చెందిన ఒక యువకుడిని విజయవాడ పోలీసులు అదుపులోకి తీసుకుని ఆయన పై థర్డ్ డిగ్రీ ప్రయోగించారంటూ వైసీపీ నేత అంబటి రాంబాబు ఆరోపిస్తున్నారు.

అందుకు ఆధారంగా తన సోషల్ మీడియాలో సాయి కృష్ణ కు సంబంధించిన ఫోటోలను షేర్ చేసారు. అందులో సాయి కృష్ణ తీవ్రగా బాధించబడినట్టుగా కనిపిస్తున్నారు. అయితే సాయికృష్ణ ను పోలీసులే అతిదారుణంగా హింసించి, కొట్టి చంపేశారని, ఆయన ను లాకప్ డెత్ చేసారంటూ సాయికృష్ణ మేనమామ తో కలిసి గుంటూరు లో మీడియా ముందుకొచ్చారు అంబటి.

సాయికృష్ణ తప్పు చేస్తే చట్టపరంగా శిక్షించాలి కానీ ఇలా ఆయన్ను లాక్ డెత్ చేసే అధికారం పోలీసులకు ఎవరిచ్చారని, లేని మనిషిని ఈ నెల 29 న కోర్టులో పోలీసులు ఎలా హాజరుపరుస్తారో చూస్తాం అంటూ అంబటి, సాయికృష్ణ కుటుంబానికి మద్దతుగా నిలబడ్డారు.

ఇక పేర్ని నాని సైతం మీడియా ముందుకొచ్చి సాయికృష్ణ బూడిదైన, ఎముకలైన, శవమైన సాయికృష్ణ కుటుంబానికి అప్పగించాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఒక కాపు యువకుడి మీద కూటమి ప్రభుత్వం ఇంత దారుణానికి ఒడికడుతుందా అంటూ సాయికృష్ణ వివాదానికి కూడా కుల ముద్ర వేసే ప్రయత్నం మొదలుపెట్టింది వైసీపీ.

అయితే సాయికృష్ణ వివాదం ఇప్పటికి చూస్తానికి చిన్న అంశమే అయినా ఒక వ్యక్తి పోలీసుల కస్టడీ లో ఉంటూ కనిపించకుండా పోయాడు, లాక్ డెత్ అయ్యాడు అంటూ జరుగుతున్న ఈ ప్రచారం ప్రజలలోకి బలంగా వెళితే అది మరో నారావారి రక్త చరిత్ర మాదిరి కూటమి ప్రభుత్వ పాలన పై నీలి నీడలు కమ్మినట్టే అవుతుంది.

గతంలో వైసీపీ మాదిరే ఇప్పుడు కూటమి కూడానా వ్యవహరిస్తుందా.? అనే సందేహాలు ప్రజలలో బలపడతాయి. అసలు సాయికృష్ణ ఎవరు.? పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకోవడానికి గల కారణాలు ఏమిటి.? అసలు సాయికృష్ణ జీవించి ఉన్నాడా.? లేడా.? ఉంటే ఎక్కడున్నాడు.? ఇలా ఆయనకు సంబంధించిన విషయాల పట్ల స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది.

సాయికృష్ణ చుట్టూ జరుగుతున్న ఈ రాజకీయం, కుల ప్రస్తావనలు కూటమి ప్రనుత్వం పై అపోహలకు కారణాలుగా మారతాయి. వివాదం ముదరక ముందే ప్రభుత్వం ఈ అంశం మీద స్పందించి సాయికృష్ణ కుటుంబం తో పాటుగా ప్రజలకు కూడా సాయికృష్ణ గురించిన వివరాలను బహిర్గతం చెయ్యాలి.

ADVERTISEMENT
Latest Stories