వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తాము టీడీపీ, జనసేన పార్టీ నాయకులను, కార్యకర్తలని అక్రమ కేసులతో ఎంతగా వేధించామో మరిచిపోయినట్లు, కూటమి ప్రభుత్వం తమని అక్రమకేసులతో వేధిస్తోందని సజ్జల రామకృష్ణా రెడ్డి అనడం చాలా హాస్యాస్పదంగా ఉంది.
2014-19 మద్య తమ జోలికిరాని సిఎం చంద్రబాబు నాయుడు, ఇప్పుడు ఎందుకు వస్తున్నారు? అని సజ్జల రామకృష్ణా రెడ్డి ఒక్కసారి ఆలోచిస్తే సమాధానం ఆయనకే తెలుసు.
వైసీపీలో కేసులు ఎదుర్కొంటున్నవారందరూ చేసిన నేరాలు ఊహాజనితమైనవి కావని ఆయనకీ తెలుసు. ఆయన ఆదేశిస్తేనే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లని అవహేళన చేస్తూ తాను మాట్లాడానని పోసాని కృష్ణ మురళి చెప్పారు.
మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు ‘సైకిల్ని ఏదో చేశారని’ పోలీసులు కేసు పెట్టారని సజ్జల చెప్పడమే నేరం చేశారని ధృవీకరిస్తున్నారు కదా? రోడ్డుపై సైకిల్ తొక్కుకుంటున్న చిన్న పిల్లాడి సైకిల్ లాక్కొని దానిని ముక్కలు ముక్కలు చేస్తే వారికి పైశాచిక ఆనందం కలిగి ఉండవచ్చు. కానీ అది నేరమే కదా?
వివేకా దారుణ హత్య, మద్యం కుంభకోణం, క్వార్జ్ గనులు తవ్వకాలు, పోలింగ్ సమయంలో లోపలకు జొరబడటం, ఓటర్లు, సిబ్బందిపై దాడులు చేయడం, ఈవీఎం ధ్వంసం చేయడం, గోదాములలో నుంచి రేషన్ బియ్యం మాయం చేయడం, కాకినాడ పోర్టు నుంచి ఆఫ్రికా దేశాలకు రవాణా చేయడం, అందుకోసం పోర్టుని బలవంతంగా బదిలీ చేయించుకోవడం వంటి నేరాలన్నీ ఊహాజనితమైనవా? సజ్జల రామకృష్ణా రెడ్డి చెపితే బాగుంటుంది.
రాష్ట్రంలో శాంతి భద్రతల క్షీణిస్తున్నాయని వైసీపీ నేతలే పదేపదే ఆరోపిస్తుంటారు. మరి వాటికి వారే భంగం కలిగించడం దేనికి?వారు రోడ్లపై విచ్చలవిడిగా ప్రవర్తిస్తుంటే పోలీసులు చూస్తూ ఊరుకోవాలా?కేసు పెడితే కక్ష సాధింపా?
చేబ్రోలు జాన్ విక్టర్ అనే రౌడీ షీటర్ కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్ తెనాలి వెళ్ళగా, అటువంటి నేర చరిత్ర ఉన్న నందిగాం సురేష్ని పరామర్శించడానికి సజ్జల రామకృష్ణా రెడ్డి నేడు గుంటూరు జైలుకి వెళ్ళారు. ఈ పరామర్శలు కూడా వైసీపీలో నేర చరిత్ర ఉన్నవారికి అండగా నిలబడుతుందని చెపుతున్నట్లే కదా?
“మా అధినేత జగన్మోహన్ రెడ్డితో సహా అంబటి రాంబాబు, విడదల రజనీ అందరినీ కూడా అరెస్ట్ చేయించినా ఆశ్చర్యం లేదని సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు.
మద్యం కుంభకోణం కేసు విచారణ తుది దశకు చేరుకుంది. దాని సూత్రధారి, అంతిమ లబ్ధిదారు జగన్ అని ఇప్పటికే స్పష్టంఅవుతోంది. కనుక తన అరెస్ట్ అనివార్యమని జగన్ స్వయంగా చెప్పుకున్నారు. జగన్ అరెస్ట్ ఖాయమని వైసీపీలో అందరికీ తెలుసు. నేడు సజ్జల మరోసారి ధృవీకరించారని చెప్పవచ్చు.




