అదేమి విచిత్రమో కానీ జగన్ తనని తాను సమర్ధించుకుంటూ సిఎం చంద్రబాబు నాయుడుపై చేసే విమర్శలు వింటునప్పుడు, జగన్ ఆయనని విమర్శిస్తున్నారా లేదా తనని తానే విమర్శించుకుంటున్నారా?అనే సందేహం కలుగుతుంటుంది.
ఉదాహరణకు “నిరంకుశత్వంగా వ్యవహరిస్తూ రాక్షసపాలన చేస్తే ప్రజలు తిరగబడతారు. ఎన్నికలలో ఓడించి ఇంట్లో కూర్చోబెడతారు,” అని జగన్ అన్నారు. కానీ ఈ మాటలన్నీ ఆయనకే వర్తించిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు జగన్-షర్మిల ఆస్తుల వివాదంలో ఆయన తరపు వకాల్తా పుచ్చుకొని కొమ్మినేని శ్రీనివాసరావు “వైఎస్ విజయమ్మ వాస్తవాలు చూడలేని స్థితిలో ఉన్నారా?” అనే శీర్షికన వ్రాసిన ఓ ఆర్టికల్ నేడు సాక్షి ఆన్లైన్లో పత్రికలో ప్రచురితమైంది.
అయితే దానిలో ఆయన మహాభారతం, దృతరాష్ట్రుడు, గాంధారి, దుర్యోధనుడి పాత్రలని ప్రస్తావిస్తూ వారితో వైఎస్ కుటుంబాన్ని పోల్చుతో మొదలుపెట్టడం చూసినప్పుడు ఎవరికైనా చిర్నవ్వు రాకమానదు. ముందు ఆయన వ్రాసిన ఆ పురాణమే చెప్పుకుందాము.
“మహా భారత గాధలో ధృతరాష్ట్రుడు పుట్టుగుడ్డి. ఆయన అంధత్వాన్ని గౌరవిస్తూ భార్య గాంధారి కూడా ఆజన్మాంతం కళ్ళకు గంతలు కట్టుకునే జీవిస్తుంది. అంటే కళ్ళుండి కూడా ప్రపంచాన్ని చూడలేకపోయిందన్న మాట.
గాంధారి, ధృతరాష్ట్రులకు పెద్ద కొడుకు దుర్యోధనుడంటే విపరీతమైన ప్రేమ. ఈ అతిగారాబం కారణంగా దుర్యోధనుడు అహంకారిగా, దుష్టలక్షణాలు కలిగిన వ్యక్తిగా మారతాడు. తత్ఫలితంగా యుద్ధానికి కాలుదువ్వి ఘోర పరాజయం చెందడం, కురువంశం నాశనం జరిగాయని మహాభారతం చెబుతోంది.
ఇది పురాణమో! లేక ఇతిహాసమో! మరేదైనా కానీ ఇందులో నేర్చుకోగలిగిన వారికి నేర్చుకున్నంత జ్ఞానం ఉంది,” అంటూ వైఎస్ కుటుంబాన్ని కౌరవ కుటుంబమని కొమ్మినేని తేల్చి చెప్పేశారు.
ఆయన చెప్పిన ఈ పురాణమో లేదా ఇతిహాసం ప్రకారమే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ధృతరాష్ట్రుడని, విజయమ్మ కళ్ళుండి చూడలేకపోతున్న గాంధారిలా కొమ్మినేని మొహమాటం లేకుండానే చెప్పేశారు.
తల్లితండ్రుల అతి గారాబం వలన దుర్యోధనుడు అంటే జగన్మోహన్ రెడ్డి అహంభావిగా, దుర్మార్గుడిగా మారాడని కొమ్మినేని చెప్పకనే చెప్పేశారు.
యుద్ధానికి అంటే ఎన్నికలలో (సిద్దం అంటూ) కాలు దువ్వి కౌరవ వంశాన్ని అంటే వైసీపిని నాశనం చేసుకున్నారని కొమ్మినేని చెపుతున్నట్లుగా అనిపించడం సహజమే.
ముక్తాయింపుగా ఈ కౌరవగాధ నుంచి అంటే వైఎస్ కుటుంబం నుంచి గుణపాఠం నేర్చుకోవచ్చని కొమ్మినేనివారు సెలవిచ్చారు.
విజయమ్మని గాంధారితో పోల్చుతూ షర్మిలపై గుడ్డి ప్రేమతో లేదా ఆమె బెదిరింపులకు భయపడి, కొడుకు జగన్ తప్పు చేశాడని వేలెత్తి చూపుతూ లేఖ వ్రాశారని, అది చాలా తప్పని కొమ్మినేని తేల్చి చెప్పారు.
జగన్ సొంత పత్రిక సాక్షిలోనే తల్లి విజయమ్మని గాంధారితో పోల్చుతూ ఇటువంటి కధనం వేసుకోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది కదా?
అయితే ఈ కధనంలో షర్మిలని దోషిగా నిరూపించే ఈ ప్రయత్నంలో కొమ్మినేనివారు మొత్తం వైఎస్ కుటుంబాన్ని కౌరవ కుటుంబంగా అభివర్ణించేశారు.
తల్లి తండ్రుల గారాభంతో చెడిపోయి, ఎన్నికలలో ఓడిపోయి, కుటుంబ ప్రతిష్టని మంటగలుపుతున్నవాడిగా జగన్ని చూపడానికి ఆయనకు చాలా సాహసమే ఉండాలి.
ఇదంతా తల్లి, చెల్లితో చేస్తున్న యుద్ధంలో భాగమే అని జగన్ సరిపెట్టుకుంటున్నారేమో కానీ ఈ భారతం, దానిలో ఈ పోలికలు చూసి జనాలు నవ్వుకోకుండా ఉంటారా?




