ప్రజాసంకల్ప యాత్ర కోసం ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు మార్చుకున్నారని, పలు తెలుగు మీడియా ఛానెల్స్తో పాటు సోషల్ మీడియాలో వార్త ప్రచారం జరిగింది. న్యూమరాలజీ ప్రకారం ఇక ముందు ‘జేఎంఆర్’ గా పిలువబడతారని ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలని వైకాపా ఖండించింది.
సాక్షిలో ఇచ్చిన వివరణ ప్రకటనలో నిరాధార వార్తలను నమ్మెద్దని ప్రజలతో పాటు, పార్టీ అభిమానులకు పార్టీ వర్గాలు విజ్ఞప్తి చేశాయి. ఇటువంటి అసత్య కథనాలను ప్రసారం చేయొద్దని మీడియాను కోరాయి. ఏదైనా ప్రత్యేక అంశం ఉంటే మీడియా సమావేశం లేదా పత్రికా ప్రకటన ద్వారా పార్టీ శ్రేణులతో పాటు కార్యకర్తలను తెలియచేస్తామని పార్టీ నేతలు ప్రకటించారు.
మరోవైపు ఈ నెల 6నుండి ఇడుపులపాయలో మొదలయ్యే జగన్ పాదయాత్ర శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు సాగుతుందని, 13 జిల్లాల్లో దాదాపు 3 వేల కిలోమీటర్ల మేరకు ఈ యాత్ర కొనసాగనుంది. జగన్ ప్రతీరోజూ 15 నుంచి 16 కిలోమీటర్లు నడిచి, రాత్రిపూట అక్కడే బస చేస్తారని పార్టీ తెలిపింది. పాదయాత్ర సందర్భంగా పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు ఆయనతో కలసి నడుస్తారు.


