వైస్ షర్మిల రెడ్డిని మురుసుపల్లి షర్మిల శాస్త్రి గా ప్రజలకు పరిచయం చేస్తున్న సాక్షి కథనాలు, డిబేట్లు చూస్తుంటే షర్మిల పై బ్లూ మీడియా ఎంతటి ఆక్రోశాన్ని నింపుకుందో అర్దమవుతుంది.
తాజాగా సాక్షిలో జరిగిన కొమ్మినేని డిబేట్ లో వైస్సార్ అభిమాని అంటూ పాల్గొన్న కొండా రాఘవ రెడ్డి షర్మిల పై అనుచిత వ్యాఖ్యలు చేసారు. జగన్ జైల్లో ఉన్నప్పుడే షర్మిల మనస్సులో ఒక విష బీజం నాటుకుంది. వైస్ భారతి రెడ్డి చేయవలసిన పాదయాత్ర తానూ చేస్తాను అంటూ ప్రకటించి అప్పుడే షర్మిల తన మనస్సు నిండా విషం నింపుకుంది అంటూ కొండా రాఘవ్ రెడ్డి ఇప్పుడే కళ్ళు తెరిచారు.
‘నాలో నాతో’ అనే పుస్తకంలో విజయలక్ష్మి కూడా ఆమె వివాహం విషయంలో తనతండ్రి వైస్సార్ చేతే కంటతడి పెట్టించిన మహాతల్లి షర్మిల అంటూ చెప్పారు. మహా అహంకారి, ఎన్నో అబద్దాలు చెపుతూ ఉసరవల్లే సిగ్గుపడేలా షర్మిల ప్రవర్తిస్తున్నారంటూ షర్మిల పై విలువల తో కూడిన విమర్శలతో సొంత చెల్లి పై డిబేట్లు చేస్తుంది సాక్షి మీడియా.
చాలా ఇంటరెస్టింగ్ విషయాలు చెపుతున్నారు, ఇటువంటి విషయాలే చెప్పండి..అంటూ వెటకారంగా నవ్వుతూ కొమ్మినేని, కొండా రాఘవ్ ను ప్రోత్సహించడం…, ఆయన షర్మిల పై రెచ్చిపోవడం చూస్తోంటే షర్మిల గురించి ఇన్ని నిజాలు మీకు ఇప్పుడే తెలిసాయా..?అనే అనుమానం అందరికి వస్తుంది. ఇంత విషం నిండిన షర్మిలను 2019 ఎన్నికల ప్రచారం వరకు జగన్ ఎందుకు పక్కనే పెట్టుకున్నారో కూడా కొండా రెడ్డి చెపితే బాగుండేది.
షర్మిల జగ మొండి అని విజయలక్ష్మి నే తనకు చెప్పిందని, బ్రదర్ అనిల్, షర్మిల బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడితే అందుకు జగన్ అంగీకరించకపోవడంతో ఇటువంటి దుర్మార్గపు పనులు చేస్తోందంటూ షర్మిలను వ్యక్తిగతంగా టార్గెట్ చేసారు కొండా రెడ్డి. తెలంగాణ లో షర్మిల పెట్టిన YSRTP లో జాయిన్ అయ్యి ఆ పార్టీ తరుపున తెలంగాణలో పోటీ చేయడానికి సిద్ధపడ్డ కొండా రాఘవ్ రెడ్డి కి షర్మిల ‘వైస్ కాదు మురుసుపల్లి’ అని అప్పుడు తెలియదా..?
షర్మిల మనస్సులో 2014 లోనే విష బీజం నాటుకుంది అని తెలిసిన రాఘవ్ రెడ్డి 2023 లో షర్మిల పార్టీ పెడితే ఎందుకు మద్దతుగా నిలబడ్డారో ఇప్పుడు సమాధానం చెప్పగలరా..? షర్మిలకు రాజకీయ అహంకారం ఏపీ రాజకీయాలలోకి అడుగుపెట్టగానే వచ్చిందా..?abn రాధా కృష్ణ తో ఇంటర్ వ్యూ ఇచ్చినప్పుడే షర్మిల పరోక్షంగా వైస్ జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడారు.
అప్పుడు షర్మిలను తప్పుపట్టకపోగా, ఆమె పార్టీలో చేరి తన రాజకీయ ప్రయోజనాలు చూసుకున్న కొండా రాఘవ్ రెడ్డి ఇప్పుడొచ్చి షర్మిల విలువల గురించి మాట్లాడం ఆయన విలువను తగ్గిస్తుందని తెలుసుకోలేకపోవడం కొండా అవివేకమే అవుతుంది. ఆస్తులమ్మి తెలంగాణ లో రాజకీయాలు చేసి చేతులు కాల్చుకున్న షర్మిల కు చంద్రబాబు తెలంగాణలో పోగొట్టుకున్న మొత్తాని తిరిగి ఇస్తానంటూ ఒప్పించి ఏపీ రాజకీయాలలోకి తీసుకువచ్చారంటూ బాబు పైకి స్క్రిప్ట్ మార్చారు సదరు కొండా రెడ్డి.
బాబుతో కుదుర్చుకున్న లోపాయికారి ఒప్పందంతోనే షర్మిల జగన్ కు వ్యతిరేకంగా పని చేయడానికి ఏపీ రాజకీయాలకు వచ్చిందంటూ, టీడీపీ ఆఫీస్ నుంచి వచ్చిన స్క్రిప్ట్ పేపర్ బట్టి పట్టి మీడియా ముందుకు వచ్చి జగన్ పై రెచ్చిపోతుంది అంటూ వైసీపీ కి అలవాటైన విమర్శలే మళ్ళీ మొదలుపెట్టారు. జనసేన అధినేత పవన్ కు ప్యాకేజీ ఇచ్చి, స్క్రిప్ట్ పేపర్ అందించేది బాబే, షర్మిలకు డబ్బులిచ్చి, జగన్ పై విమర్శలు చేయడానికి స్క్రిప్ట్ అందించేది బాబే…, పురందరేశ్వరి కి అండగా ఉండేది బాబే..,అంటూ ఇలా లాజిక్ లేకుండా మాట్లాడం ఒక్క జగన్ మద్దతుదారులకు సొంతం అనుకుంటా.
బాబు తానే డబ్బులిచ్చి షర్మిలతో తనపైనే విమర్శలు చేయించుకుంటున్నారా..? అలా చేసేకన్నా టీడీపీ పార్టీలోకి షర్మిలని ఆహ్వానించి పార్టీలో ఎదో ఒక కీలక పదవి అప్పగిస్తే బాబు పని మరింత సులువు కావచ్చు కదా..! జూనియర్ ఎన్టీఆర్ ను అడ్డుపెట్టుకుని టీడీపీ పై విషం చిమ్మి నారా, నందమూరి కుటుంబాల మధ్య చిచ్చు పెట్టే వైసీపీ మద్దతుదారులు, సాక్షి మీడియా వైస్సార్ కూతురి పై ఇటువంటి విషప్రచారాలు చేయడం వారి విలువలకు అద్దం పడుతుంది.
ఒకే కుటుంబానికి సంబందించిన వ్యక్తులు వారి వారి ఆలోచనలు, అవసరాల మేరకు వేరువేరు రాజకీయ పార్టీల తరుపున పని చేయవచ్చు. అది వారి వ్యక్తిగతం. చంద్రబాబు కుటుంబసభ్యులైనా పురందరేశ్వరి బీజేపీ కి, ఆయన భర్త దగ్గుపాటి వెంకటేశ్వరరావు గతంలో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉండేవారు. అలాగే కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ భర్త కూడా టీడీపీ పార్టీ సభ్యుడిగా ఉండేవారు.
అలాగే సోదర బంధం కన్నా ఎక్కువ అనుబంధం ఉండే పవన్ – చిరు ల మధ్య కూడా రాజకీయ విభేదాలు ఉండేవి. అలా అని సొంత కుటుంబ సభ్యుల పై విలువలు గాలికొదిలేసి, దిగజారుడు వ్యాఖ్యలు చేయడం, దగ్గరుండి చేపించడం మాత్రం ఒక్క జగన్ కే సొంతం అని నిరూపించుకున్నారు సాక్షి కథనాలతో.




