దివంగత సిఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయంలో అంటే 2008లో మార్గదర్శిపై క్రిమినల్ కేసు నమోదు అయ్యింది. ఆర్బీఐ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రజల నుంచి డిపాజిట్లు సేకరిస్తోందని ప్రధాన ఆరోపణ. కానీ మార్గదర్శి హైకోర్టుని ఆశ్రయించగా సుదీర్గ విచారణ జరిపి దానిపై నమోదు చేసిన క్రిమినల్ కేసుని రద్దు చేసింది.
అప్పుడే ఉండవల్లి అరుణ్ కుమార్ ఎంట్రీ ఇచ్చి హైకోర్టు తీర్పుని సుప్రీంకోర్టులో సవాలు చేశారు. సుప్రీంకోర్టు కూడా దానిపై సుదీర్గ విచారణ జరిపిన ఉండవల్లి పిటిషన్ని కొట్టివేసింది. పైగా వ్యక్తిగత కక్ష, దురుదేశ్యంతో ఇలాంటి పిటిషన్లు వేయడం సరికాదంటూ మొట్టి కాయలు కూడా వేసింది.
ఇప్పుడు చర్చ ఆ కేసు గురించి కాదు. ఆ కేసుతో ఉండవల్లి ఏం సాధించాలనుకున్నారు? ఏం సాధించారు?ఎవరికి మేలు కలిగింది? ఎవరికి ఎదురుదెబ్బ తగిలిందని ఆలోచిస్తే కొన్ని ఆసక్తికర విషయాలు కనిపిస్తాయి.
మార్గదర్శి అంటే రామోజీరావు. ఆయన… చంద్రబాబు నాయుడుకి మద్దతుగా నిలబడేవారు. రాజకీయంగా టీడీపి ఎదుగుదలలో ఆయన పాత్ర, ఈనాడు దినపత్రిక పాత్ర ఎంతైనా ఉంది.
జగన్ సొంత మీడియా సాక్షికి ఈనాడు మీడియా గట్టి పోటీ ఇస్తోంది. కనుక వారికి ఉడతా భక్తిగా సాయపడవచ్చని ఉండవల్లి ఈ కేసు వేసి ఉండవచ్చు.
అయన న్యాయవాది కనుక మార్గదర్శి ఆర్ధిక వ్యవహారాలపై కేసు నడిపిస్తే మార్గదర్శి విశ్వసనీయత దెబ్బ తింటుందని భావించి ఉండవచ్చు.
అయితే మార్గదర్శి డిపాజిట్ సొమ్ము పూర్తిగా చెల్లించేయడంతో డిపాజిట్ల సేకరణ, చెల్లింపుల విషయంలో ఉండవల్లి అంచనాలు తారుమారు అయ్యాయి. పైగా సుప్రీంకోర్టులో చివాట్లు తినాల్సి వచ్చింది కూడా.
మార్గదర్శి విశ్వసనీయతని తద్వారా దాని ఆర్ధిక మూలాలను దెబ్బ తీద్దామనుకుంటే, ఈ కేసు వల్లనే మార్గదర్శికి అనుకూలంగా తీర్పు రావడంతో దాని విశ్వసనీయత మరింత పెరిగింది. కడిగిన ఆణిముత్యంలా బయటపడ్దామని అప్పుడే ‘ఈనాడు’ చెప్పుకుంటోంది కూడా.
మరోపక్క సుప్రీంకోర్టు కేసు కొట్టేయడమే కాకుండా చివాట్లు కూడా పెట్టడంతో ఉండవల్లి ఇప్పుడు తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది కూడా. కనుక సుప్రీంకోర్టు చేత మార్గదర్శికి ఆణిముత్యం సర్టిఫికేట్ ఇప్పించిన ఘనత ఖచ్చితంగా ఉండవల్లి అరుణ్ కుమార్కే దక్కుతుంది.





