సినిమా సినిమాకు సంచలనమైన రికార్డులకు కేరాఫ్ అడ్రస్ లుగా నిలుస్తున్న ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్, ప్రస్తుతం “సుల్తాన్” సినిమా ద్వారా గత రికార్డులను బద్దలు కొట్టే పనిలో ఉన్నాడు. అయితే ఆ రికార్డులే ప్రస్తుతం సల్మాన్ కొంపముంచేలా కేసులు నమోదు కావడం విశేషం. ‘సుల్తాన్’ కథ తనదేనని, ఈ విషయంలో తనకు సొమ్ము ముట్టజెబుతానని చెప్పి హీరో సల్మాన్ ఖాన్ తనను మోసం చేశాడని ముజఫర్ పూర్ కు చెందిన మొహ్మద్ సబీర్ అన్సారీ అలియాస్ సబీర్ బాబా ఆరోపణలు గుప్పించారు.
దీనికి అనుగుణంగా దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన ముజఫర్ పూర్ చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టు ఈ మేరకు సల్మాన్ ఖాన్ పై కేసు నమోదు చేసింది. సల్మాన్ ఖాన్ తో పాటు ‘సుల్తాన్’ చిత్ర హీరోయిన్ అనుష్క శర్మ, దర్శకుడు అలీ జఫార్ అబ్బాస్ లపైనా కేసు నమోదుకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణను ముజఫర్ పూర్ ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టుకు బదిలీ చేసిన చీఫ్ జ్యుడిషియల్ కోర్టు విచారణను ఈ నెల 26కు వాయిదా వేసింది. కోర్టు ఆదేశాలతో సల్మాన్, అనుష్క, అబ్బాస్ లపై పోలీసులు ఐపీసీ సెక్షన్లు 420, 406, 504, 506ల కింద కేసు నమోదు చేశారు.



