సంక్రాంతి పండుగకు హైదరాబాద్ దాదాపు ఖాళీ అయిపోతుంది. ఆంధ్రా నుంచి వెళ్ళి అక్కడ స్థిరపడిన లక్షల మంది కుటుంబాలతో సహా పండుగకి సొంతూర్లకు బయలుదేరుతారు.
జనవరి 10,11 శనివారం, ఆదివారం పడ్డాయి. కనుక శుక్రవారం సాయంత్రం నుంచే హైదరాబాద్ నుంచి ఏపీకి బయలుదేరేవారు చాలా మందే ఉంటారు. ఆ రోజు నుంచి సంక్రాంతి పండగ రోజు వరకు హైదరాబాద్-విజయవాడ హైవే ఖాళీ ఉండదు. ఒకేసారి వేల వాహనాలు రోడ్డుపైకి వచ్చేసరికి జాతీయ రహదారిలో టోల్ ప్లాజాల భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంటుంది. ఏటా ఇదే జరుగుతుంది.
కనుక ఈ ట్రాఫిక్ జామ్ నివారించేందుకు జనవరి 9 నుంచి 14 వరకు, మళ్ళీ తిరుగు ప్రయాణంలో 16 నుంచి 18 వరకు హైదరాబాద్-విజయవాడ మద్య టోల్ ప్లాజాల వద్ద రుసుము కోసం ఆపకుండా ప్రజలు ఉచితంగా ప్రయాణించేందుకు అనుమతించాలని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి లేఖ వ్రాశారు. దీనిపై కేంద్రమంత్రి ఏమంటారో ఇంకా తెలియాల్సి ఉంది.
ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ముగ్గురికీ నితిన్ గడ్కరీకి ఫోన్ చేసి నేరుగా మాట్లాడగలిగే చనువు ఉంది. కనుక వారే మాట్లాడితే బాగుంటుంది. లేదా బిజేపి మంత్రులు, ఎంపీలు మాట్లాడవచ్చు. లేదా ఏపీ ప్రభుత్వం తరపున ఏపీ రవాణా మంత్రి రాంప్రసాద్ రెడ్డి కూడా కేంద్రానికి లేఖ వ్రాసినా నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించే అవకాశం ఉంటుంది.
ఇది రెండు ప్రభుత్వాలకు చాలా చిన్న విషయమే కావచ్చు. కానీ భార్యా, పిల్లలు, తల్లితండ్రులను వెంటబెట్టుకొని హైదరాబాద్ నుంచి బయలుదేరినవారు టోల్ ప్లాజాల వద్ద గంటల తరబడి ట్రాఫిక్ జాములో చిక్కుకోవడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది.
కనుక ఈ ఒక్క సంక్రాంతి పండుగకు మాత్రమే కాక ముఖ్యమైన అన్ని పండుగ దినాలలో టోల్ ప్లాజా ఫీజ్ చెల్లించకుండా రాకపోకలు సాగించేందుకు కేంద్రం అనుమతిస్తే అందరూ హర్షిస్తారు.






