అలనాడు రామాయణంలో శ్రీరాముడు బాణం సంధిస్తే అది శత్రుసంహారం చేసి తిరిగివచ్చి ఆయన అమ్ముల పొదిలో చేరేది. అయితే జగనన్న సంధించిన బాణం శత్రుసంహారం చేయకపోగా వారి చుట్టూ తిరిగి తిరిగి చివరికి వారి చేతిలోనే ఆయుధంగా మారిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆ బాణాన్ని జగన్ మీదకే సంధిస్తోంది.
జగనన్న బాణం మొదట ఏపీకి వెళ్ళేందుకు కాస్త మొహమాటపడి మొరాయించి నా, అన్నకు లేని ప్రేమాభిమానాలు తనకెందుకని ఏపీకి దూసుకువచ్చేస్తోంది. అది ఎక్కడ ఎలా గుచ్చుకొంటుందో, దాంతో ఎంత నొప్పి, బాధ ఉంటాయో అని జగన్, వైసీపి నేతలతో సహా అందరూ లెక్కలేసుకొంటున్నారు.
అది ఎలాగూ జగన్ గుండెల్లోనే గుచ్చుకోబోతోందని ఇప్పటికే స్పష్టమైపోయింది. అయితే తుఫానులా ఏపీ వైపు దూసుకువస్తున్న ఈ మూడు రంగుల కాంగ్రెస్ బాణం వలన జనసేనకు కూడా నష్టం ఉంటుందా?అంటే ఎంతో కొంత నష్టం ఉంటుందని చెప్పక తప్పదు.
ఆమె ప్రధానంగా వైసీపీని, దానిలో నేతలను, ఆ పార్టీ ఓటు బ్యాంకుని ‘హ్యాక్’ చేయబోతున్నప్పటికీ, ఇప్పుడిప్పుడే జనసేనవైపు చూస్తున్న క్రీస్టియన్లు, మైనార్టీలు కాంగ్రెస్వైపు మొగ్గితే జనసేన నష్టపోవచ్చు. ఆమె మహిళ కనుక బడుగు బలహీన వర్గాల మహిళలు ఆమె వైపు ఆకర్షితులయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
ఆమె భర్త బ్రదర్ అనిల్ రాష్ట్రంలో క్రీస్టియన్ ఓటర్లను ఆకర్షించగలరని వేరే చెప్పక్కరలేదు. కన్వర్టడ్ క్రీస్టియన్లలో ఎక్కువగా బడుగు బలహీన వర్గాలకు చెందినవారే ఉన్నారు. వారందరినీ బ్రదర్ అనిల్ కాంగ్రెస్ వైపు మళ్ళించగలిగితే వైసీపి, టిడిపి, జనసేన మూడు పార్టీలు కూడా నష్టపోతాయి.




