గతంలో చంద్రబాబు 23 మంది వైసీపీ నాయకులను టీడీపీ పార్టీలోకి ఆహ్వానించి వారిలో కొందరికి పదవులు కూడా కట్టబెట్టారని అందుకనే 2019 లో జరిగిన ఎన్నికలలో టీడీపీ పార్టీకి 23 సీట్లే వచ్చాయని ఇదే దేవుడి స్క్రిప్ట్ అంటూ వైసీపీ అధినాయకత్వం నుంచి కింద స్థాయి కార్యకర్త వరకు ప్రచారం చేసుకున్నారు.
కానీ ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డికి అసలైన దేవుడి స్క్రిప్ట్ ఏమిటో ఆయన సోదరీమణులు 2024 ఎన్నికలకు ముందే చూపించడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే తన తండ్రి వైస్సార్ చావుకి కాంగ్రెస్ అధిష్టానానికి ఎటువంటి సంబంధం లేదని క్లిన్ చిట్ ఇచ్చి మరి వైస్ షర్మిల కాంగ్రెస్ హస్తాన్ని అందుకుంది. అలాగే తన తండ్రి చావుకి న్యాయం చేయాలంటూ అదే బాటలో కాంగ్రెస్ పార్టీలో చేరడానికి జగన్ మరో సోదరి వైస్ సునీతా రెడ్డి రెడీ అయ్యారని సమాచారం.
కడప రాజకీయాలను ప్రభావితం చేయడానికి వైస్ సునీతా కానీ వైస్ షర్మిల కానీ కాంగ్రెస్ పార్టీ తరుపున ఎన్నికల బరిలో దిగడానికి, వైసీపీ పార్టీకి ఊహించని షాక్ ఇవ్వడానికి తెరవెనుక రాజకీయాలు ఇప్పటికే మొదలుపెట్టారని ఊహాగానాలు ఊపందుకున్నాయి. తన తండ్రి హత్యకు కారణమైన వారిని శిక్షించి తనకు న్యాయం చేయాలంటూ సునీతా రెడ్డి చేస్తున్న ప్రయత్నాల వెనుక చంద్రబాబు ఉన్నాడని,షర్మిల కాంగ్రెస్ గూటికి చేరడంలో బాబు పాత్ర ఉందంటూ ప్రచారం చేసిన సజ్జల గారు ఇప్పుడు ఈ వ్యూహం వెనుక కూడా బాబు హస్తమే ఉందంటారేమో మరి.
రాహుల్ గాంధీని దేశ ప్రధానిగా చూడాలన్నదే తన తండ్రి చివరి ‘ఆశయం’, దానిని నెరవేర్చడానికి శాయశక్తులా ప్రయత్నిస్తా, దానికోసం ఎవరిని ఎదిరించడానికైనా, ఎవరితో పోరాడడానికైనా సిద్ధం అంటూ ఒక చెల్లి షర్మిల జగన్ పై యుద్దానికి సిద్దమైన తరుణంలో …తన తండ్రి చావుకి న్యాయం చేస్తా, దాని కోసం ఎంతకాలమైనా న్యాయపోరాటం చేస్తా, నిందితులను ప్రజల ముందు దోషులుగా నిలబెడతా అంటూ మరో సోదరి వైస్ సునీతా మరో పక్కన కాంగ్రెస్ పార్టీని విల్లుగా ఎక్కిపెట్టి జగన్ పై బాణాన్ని గురిపెట్టడానికి సిద్ధమయ్యారు. మరి తల్లి విజయలక్ష్మి ఎవరి పక్షాన నిలవనున్నారనేది ఇక్కడ కీలకాంశంగా మారనుంది.
ఏపీ రాజకీయాలలో షర్మిల ఎంట్రీ వైసీపీ ని చిక్కులలో పడేస్తే, ఇప్పుడు సునీతా ఎంట్రీ ఇన్నాళ్లు వైసీపీ విప్పని మరో చిక్కుముడిని బయటకు తీయనుందా..?అనే అనుమానాలు మొదలయ్యాయి. ఏపీ కాంగ్రెస్ లో షర్మిల ఎంట్రీ పై స్పందించిన సకల శాఖ మంత్రి సజ్జల వైస్ వివేకాకు ఏ గతిపట్టిందో చూసారుగా ఇప్పుడు కాంగ్రెస్ లో చేరిన షర్మిలకు అదే గతి పడుతుంది అంటూ హెచ్చరికలు సైతం పంపారు. మరి సజ్జల గారి హెచ్చరికలను షర్మిల, సునీతా ఏ మేరకు పట్టించుకుంటారో అనేది రానున్న రోజులలో తేలనుంది. “తండ్రి ఆశయం కోసం ఒకరు…తండ్రి చావుకి న్యాయం కోసం మరొకరు…అన్న పై యుద్దానికి సిద్ధమయ్యారు.




