రాష్ట్ర రాజధానిగా అమరావతి వద్దు అంటూ జగన్ చేసిన మావిగన్ ప్రకటన పై షర్మిల ఎదురుదాడి నిర్విరామంగా కొనసాగుతూ వస్తుంది. నిన్న జగన్ ను మావిగన్ జోకర్ గా అభివర్ణించిన షర్మిల నేడు జగన్ రాజధానిగా అమరావతి పేరును మావిగన్ గా మార్చినట్టే ఆయన సొంత నియోజకవర్గమైన పులివెందుల పేరును కూడా అవిగొడ్డలిగా మార్చాలంటూ వైసీపీ కి దిమ్మతిరిగిపోయే కౌంటర్ వేశారు.
‘M’చిలీపట్టణం, ‘V’జయవాడ, ‘GUN’టూర్ మూడు ప్రాంతాల నుంచి అక్షరాలను తీసుకుని MAVI’GUN’ అంటూ జగన్ పేరులోని GUN ను పెట్టుకున్నట్టే ఆయన నియోజకవర్గానికి కూడా ‘అవి’నాష్ రెడ్డి పేరు నుంచి ‘అవి’తీసుకుని వివేకా ‘గొడ్డలి’ వేటు నుంచి గొడ్డలి ని తీసుకుని ‘అవిగొడ్డలి’ అని పేరు పెట్టాలంటూ ప్రభుత్వానికి ఒక సూచన చేసారు షర్మిల.
దీనితో జగన్ కు ప్రియమైన GUN నుంచి మావి’గన్’… అవినాష్ కి నచ్చిన గొడ్డలి నుంచి అవి’గొడ్డలి’ రెండు కూడా వైసీపీ మెచ్చే పేర్లే అవుతాయంటూ షర్మిల మరోసారి తన ప్రతిపాదనలతో జగన్ అండ్ కో బ్యాచ్ కి ఊహించని షాక్ ఇచ్చారనే చెప్పాలి.
అసలు మావిగన్ రాష్ట్రానికి ఇంత అద్భుతమైన ఐడియా అయితే వైసీపీ ఐదేళ్ల పాలనలో ఎందుకు అమలు పరచలేదు, ప్లాన్ బి గా మావిగన్ పేరును నాడు ఎందుకు ప్రతిపాదించలేదు అంటూ వైసీపీ పై ప్రశ్నల వర్షం కురిపించారు. ఐదేళ్ల మీ ప్రభుత్వంలో మూడు రాజధానులు అంటూ గుడ్డి గుర్రానికి పళ్ళు తోమారా.? లేదా ఆ ఐదేళ్లు గాడిదలు కాసారా అంటూ వైసీపీ స్టైల్ ల్లోనే వైసీపీ కి బదులు చెప్పారు షర్మిల.
అలాగే నిన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి పై మరణం పై మీడియా ముఖంగా బొత్స భావోద్వేగానికి గురైన అంశం మీద కూడా ఆమె తనదైన శైలిలో స్పందించారు. అసలు బొత్స ఏడుపుకు కారణం ఏమిటో నాకు తెలియదు కానీ ఆయన వైఎస్ మరణానంతరం నిండు అసెంబ్లీ సభలో రాజశేఖర్ రెడ్డి పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు సభలోనే విజయమ్మ కన్నీరు పెట్టుకున్నారని, ఆమెను కన్నీరు పెట్టించినందు బొత్స విజయమ్మకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసారు.
ఇదిలా ఉంటే ఇప్పటికే మావిగన్ ప్రకటనతో జగన్ నవ్వులపాలవుతుంటే, ఇప్పుడు షర్మిల ఆయన సొంత నియోజకవర్గం పేరును అవిగొడ్డలి గా మార్చాలంటూ ప్రకటించడంతో వైసీపీ మరోసారి సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి సిద్దమయినట్టే. వివేకా దారుణ హత్య తరువాత గొడ్డలి పరోక్షంగా వైసీపీ అనధికార గుర్తుగా మారిపోయింది. ఇక ఇప్పుడు సొంత చెల్లె ఇలా గొడ్డలి, గన్ అంటూ ప్రకటించడంతో వైసీపీ పట్ల ప్రజలలో మరింత చులకన భావం పెరుగుతుంది.
అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ జగన్ ప్రతిపాదించిన మావిగన్ పైనే చర్చించుకుంటున్నారు అంటూ సాక్షి మెయిన్ హెడ్డింగ్లో వేస్తున్న కథనాల స్థానంలో రేపు షర్మిల ప్రకటించిన అవిగొడ్డలి ప్రచురించగలదా.? మావిగన్ సమర్ధింపు కోసం పోటీపడి మరి మీడియా ముందుకొస్తున్న వైసీపీ నేతలు రేపు షర్మిల ప్రకటించిన అవిగొడ్డలి గురించి మాట్లాడేందుకు మీడియా ముందుకు రాగలరా.? ఆమె వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా.?




