వైసీపీకి మరో షాక్… ఎన్డీయే సమావేశానికి టిడిపికి ఆహ్వానం!

BJP TDPఏపీలో అధికార వైసీపీకి బిజెపి అధిష్టానం ఊహించని షాక్ ఇచ్చింది. ఈ నెల 18న ఢిల్లీలోని అశోకా హోటల్‌లో బిజెపి మిత్రపక్షాలు (ఎన్డీయే) సమావేశం జరుగనుంది. దానిలో పాల్గొనవలసిందిగా టిడిపికి ఆహ్వానం పంపింది. అంటే టిడిపితో మళ్ళీ కలిసి పనిచేసేందుకు బిజెపి సిద్దంగా ఉందని సంకేతం పంపినట్లే భావించవచ్చు.

ఏపీలో దౌర్జన్యపూరితంగా వ్యవహరిస్తున్న వైసీపీని ఎదుర్కోవాలంటే కేంద్రం సహాయసహకారాలు చాలా అవసరమని టిడిపి భావిస్తోంది. అందుకే బిజెపితో పొత్తులకు ఆసక్తి చూపుతోంది. ఇప్పుడు బిజెపి స్వయంగా ఎన్డీయే సమావేశానికి టిడిపిని ఆహ్వానించడంతో టిడిపి-బిజెపి-జనసేనలు మూడూ కలిసి పనిచేయబోతున్నట్లు భావించవచ్చు.

ADVERTISEMENT

బిజెపి రాష్ట్ర అధ్యక్షులను మార్చిన తర్వాత ఇప్పుడు కేంద్రమంత్రి వర్గంలో మార్పులు చేర్పులు చేసేందుకు సిద్దం అవుతోంది. ఏపీ నుంచి టిడిపి, వైసీపీలకు చెందిన 25 మంది ఎంపీలున్నప్పటికీ, రెండు పార్టీలు ఎన్డీయేలో లేనందున కేంద్రమంత్రి పదవి ఎవరికీ లభించలేదు. ఒకవేళ ఇప్పుడు టిడిపి ఎన్డీయేలో చేరినట్లయితే ముగ్గురు టిడిపి ఎంపీలు… గల్లా జయదేవ్, కేశినేని నాని, కింజారపు రామ్మోహన్ నాయుడులలో ఎవరో ఒకరికి అవకాశం కల్పించవచ్చు. వారిలో కేశినేని నాని పార్టీ అధిష్టానంతో ఘర్షణ పడుతున్నందున మిగిలిన ఇద్దరిలో ఎవరో ఒకరికి కేంద్ర మంత్రి పదవి లభించవచ్చు.

ఒకవేళ టిడిపి ఎన్డీయేలో చేరి, మూడు పార్టీలు కలిసి ఎన్నికలలో పోటీ చేస్తే బహుశః వైసీపీకి రెండో ఛాన్స్ లభించకపోవచ్చు. సిఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి ప్రధాని నరేంద్రమోడీ, అమిత్‌ షాలను కలిసి వచ్చిన వెంటనే అనూహ్యమైన ఈ రాజకీయ పరిణామం జరగడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఈ షాక్ నుంచి తేరుకొన్నాక వైసీపీ ఏవిదంగా స్పందిస్తుందో చూడాలి.

ADVERTISEMENT
Latest Stories