ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ప్రభావితం చేసిన అనేక అంశాలలో ‘పట్టిసీమ’ కూడా ఒకటన్న విషయం తెలిసిందే. అధికార పక్షమేమో ‘పట్టిసీమ’ ద్వారా నీటిని కృష్ణకు తరలించామని చెప్తుంటే… అసలు ప్రాజెక్ట్ లేదు, ఏమీ లేదు… మసిపూసి మారేడు కాయ మాదిరి ఉందంటూ ప్రతిపక్షం చేసిన ఆరోపణలతో ప్రతి తెలుగు వాడికి పట్టిసీమ ప్రాజెక్ట్ పై ఆసక్తి పెరిగింది. ఇంత రచ్చతో పట్టిసీమపై అసలు విషయం ప్రజలు తెలుసుకోవడంతో, ప్రతిపక్షం సైలెంట్ అయ్యిందనుకోండి… అది వేరే విషయం..!
అలాంటి పట్టిసీమ బ్యాక్ డ్రాప్ తో ఒక విలేజ్ ప్రేమకధను తెలుగు తెరపై ప్రతిబింబించబోతున్నారు. “శ్రీరామరక్ష” టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా టీజర్ హీరో సునీల్ విడుదల చేసారు. ఉభయ గోదావరి జిల్లాలలోని పచ్చని పైరుల మధ్య చిత్రీకరించినట్లుగా కనపడుతున్న ఈ టీజర్ లో ప్రకృతి అందాలు హైలైట్ గా ఉన్నాయి. అలాగే టీజర్ కు తగిన విధంగా ఆహ్లాదకరమైన సంగీతం వినసొంపుగా ఉంది.
టీజర్ లో ఇంకా చెప్పుకోవడానికి ఏమీ లేనప్పటికీ, ‘ఉయ్యాలా జంపాలా’ సినిమా మాదిరి గ్రామీణ వాతావరణంలో తెరకెక్కిన ప్రేమకధ తెలుగు తెరపై ఫ్రెష్ నెస్ ను పంచేదిలా కనపడుతోంది. హీరోహీరోయిన్లు రజిత్, షామిలి కొత్త వారు కాగా, ఓ కీలక పాత్రలో నటుడు విజయ్ కుమార్ (ఖుషీ సినిమాలో భూమిక తండ్రి) నటించారు. రాము దర్శకత్వం వహించిన ఈ సినిమాను ప్రభాత్ వర్మ నిర్మిస్తున్నారు.



