తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో గత ప్రభుత్వం వేల కోట్లు అవినీతికి పాల్పడ్డారంటూ కమీషన్ వేసింది. అప్పుడు నిత్యం అదే చర్చ జరిగేది. కేటీఆర్, హరీష్ రావు తదితరులు ఆ ఆరోపణలను ఎంతగా ఖండించినా ప్రయోజనం కనపడలేదు.
కానీ తెలంగాణ ప్రభుత్వం బాధ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకోలేకపోయింది. కాళేశ్వరం కేసుని సీబీఐకి అప్పగించాలనే దాని ప్రయత్నాలు కూడా ఫలించలేదు. కనుక క్రమంగా ప్రజలపై దీని ప్రభావం కూడా తగ్గిపోయింది.
అందువల్ల కాళేశ్వరంలో కేసీఆర్ కుటుంబం అవినీతికి పాల్పడి వేలకోట్లు పోగేసుకుందని సిఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ మంత్రులు చేసే ఆరోపణలపై ప్రజలు ఆసక్తి కోల్పోయారు.
రెండున్నరేళ్ళలో వచ్చిన ఈ మార్పు బీఆర్ఎస్ పార్టీకి చాలా ఉపశమనం కలిగించిందని చెప్పక తప్పదు.
ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అదే కాళేశ్వరం ప్రాజెక్టుని ఆయుధంగా మార్చుకొని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎదురు దాడి చేస్తూ, దాంతోనే సిఎం రేవంత్ రెడ్డిని, మంత్రులను అసమర్ధులుగా, దోషులుగా ప్రజల ముందు నిలబెట్టే ప్రయత్నం చేస్తుండటం చాలా ఆశ్చర్యకరమైన రాజకీయ పరిణామమని చెప్పవచ్చు.
గోదావరిలో నీళ్ళు లేకపోతే ఏపీలో పట్టిసీమతో నీళ్ళు ఎలా ఎత్తిపోసుకుంటున్నారు?అంటూ బీఆర్ఎస్ నేతలు మూకుమ్మడిగా నిలదీస్తుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. కాంగ్రెస్ మంత్రులు హడావుడిగా దేవాదుల ప్రాజెక్టుకి వెళ్ళి అన్ని మోటార్లు ఆన్ చేయించాల్సి వచ్చింది. త్వరలో మిగిలిన అన్ని ప్రాజెక్టులలో నీళ్ళు ఎత్తిపోయక తప్పకపోవచ్చు.
పోస్తే నీళ్ళ విషయంలో బీఆర్ఎస్ వాదనలు నిజమని అంగీకరించినట్లే అవుతుంది. దాని ఒత్తిళ్ళు పని చేశాయని స్పష్టమవుతుంది. పోయకపోతే బీఆర్ఎస్ చేసే పోరాటాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ట మసకబారుతుంది. వచ్చే ఎన్నికలపై ఈ ప్రభావం పడితే నష్టపోతుంది.
నాడు కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్కు పేరు ప్రతిష్టలు ఆర్జించి పెట్టింది. ఆ తర్వాత అదే ఆయన ప్రభుత్వ పతనానికి కారణమైంది. ఇప్పుడు మళ్ళీ అదే బీఆర్ఎస్ పార్టీకి ఆయుధంగా మారింది. దాంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టి గద్దె దించేందుకు బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నిస్తుండటం రాజకీయ విచిత్రమే కదా?




