దసరా పండగకు అధికారిక ప్రెస్ మీట్ ఉంటుందని గంపెడాశలతో ఎదురు చూస్తున్న మహేష్ బాబు అభిమానులకు అలాంటి సమాచారమేమి రాలేదు గానీ, ఓ కిక్ ఇచ్చే విషయాన్ని అయితే రచయిత విజయేంద్ర ప్రసాద్ అందించారు.
జనవరి నుండి ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని చెప్పి ఎన్నాళ్లుగానో వేచిచూస్తున్న సూపర్ స్టార్ అభిమానులకు ఓ తీపి కబురును ఇచ్చారు. దీంతో జనవరి లోపునే రాజమౌళి అఫిషియల్ ప్రెస్ మీట్ ఉండబోతుందని ఖరారయ్యింది.
సాధారణంగా తాను కధ రాయడానికి ఓ రెండు, మూడు నెలల సమయం పడుతుందన్న విజయేంద్ర ప్రసాద్, ఈ సినిమాకు మాత్రం రెండేళ్ళు పట్టిందని అన్నారు. మొత్తానికి ఓ అప్ డేట్ అయితే వచ్చింది గానీ, మరో నాలుగేళ్ల వరకు మహేష్ బాబు సిల్వర్ స్క్రీన్ కు దూరమన్న టాక్ ని అయితే బాబు అభిమానులకు జీర్ణించుకోలేని అంశం.
ఈ ఏడాది డిసెంబర్ లో విడుదల కాబోతున్న హాలీవుడ్ మూవీ ‘ముఫాసా’కు మహేష్ బాబు వాయిస్ ఓవర్ అందివ్వడంతో, సూపర్ స్టార్ డైలాగ్స్ వినగలిగే అవకాశం ఫ్యాన్స్ కు దక్కుతుంది. కానీ సిల్వర్ స్క్రీన్ పై వీక్షించాలంటే మరో నాలుగేళ్ళు పాటు వెయిట్ చేయాల్సిందే.
ఇటీవల ‘దేవర’ సినిమాకు వెళ్ళిన సమయంలో ధియేటర్ లో రాజమౌళిని అడిగిన వైనం సోషల్ మీడియాలో వైరల్ కాగా, మొత్తానికి విజయేంద్ర ప్రసాద్ సమాచారంతో ఊరట చెందారు. మరో వైపు మహేష్ బాబు ఫ్యామిలీ పిక్స్ ఇంటర్నెట్ లో సందడి చేస్తున్నాయి.




