ప్రభుత్వాలు మారినా ఒక విషయం మాత్రం మారడం లేదు… అదే విగ్రహాల మీద మోజు! ఎవరు అధికారంలోకి వచ్చినా ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలు, ఓటు బ్యాంక్ లెక్కలతో భారీ విగ్రహాలు, స్మారకాలు నిర్మించడం ఇప్పుడు పరిపాటిగా మారింది.
వాటిపై ఎన్ని విమర్శలు, ఆరోపణలు వచ్చినా కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి వెనకాడటం లేదు. ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం విగ్రహాలు ఏర్పాటు చేస్తూ వాటి కోసం రైతుల జీవనోపాధినిచ్చే వ్యవసాయ భూములను తీసేసుకుంటున్నారు.
సామాన్య, నిరుపేద ప్రజల ఇళ్లు కూల్చేస్తున్నారు. వీటితో తమ పార్టీ, ప్రభుత్వం పట్ల ప్రజలలో వ్యతిరేకత పెరుగుతుంది కదా? అనే ఆలోచన కలుగకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.
కానీ రైతులకు, సామాన్య ప్రజలకు అత్యవసరమైన ప్రాజెక్టులను ఇదే స్పూర్తి, చురుకుదనంతో పూర్తిచేయరు. వాటి నిర్మాణాలు మాత్రం ఏళ్ల తరబడి నత్తనడకన సాగుతూనే ఉంటాయి. ఎందువల్ల?
ఉదాహరణకు ఫ్లోరైడ్ పీడిత నల్గొండ జిల్లాకు నీళ్లు అందించేందుకు ఎస్ఎల్బీసి సొరంగం ప్రాజెక్టు కళ్లెదుటే ఉంది. దానిని 2005లో ప్రారంభించారు. అంటే నేటికి 21 సంవత్సరాలు.
వందల కోట్లు ఖర్చు చేసినా నేటికీ పూర్తి కాలేదు. 2028 జూన్ నాటికి పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కానీ పూర్తిచేయగలదా?
చేయకపోతే ప్రభుత్వం మారితే దాని కథ మళ్లీ మొదటికి రావచ్చు. ఎందుకంటే ఒక ప్రభుత్వం చేపట్టిన పనులను మరో ప్రభుత్వం పక్కన పెట్టేయడం ఇప్పుడు చాలా కామన్. అది లక్షల కోట్ల ప్రాజెక్టు అయినా సరే!
తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇందుకు ఓ ఉదాహరణ. ఏపీ రాజధాని అమరావతి కథ అందరికీ తెలిసిందే. దానిని చంద్రబాబు నాయుడు మొదలుపెట్టినందున జగన్మోహన్ రెడ్డి నిర్దాక్షిణ్యంగా పక్కన పడేశారు.
ఏపీకి జీవనాడి వంటి పోలవరం 2004లో ప్రారంభించారు. దాని కథ కూడా సేమ్ టూ సేమ్. అమరావతి, పోలవరం పనులను 2029లోగా పూర్తిచేయాలని కూటమి ప్రభుత్వం గడువు పెట్టుకొని శరవేగంగా పనులు జరుపుతోంది.
కానీ మళ్లీ ప్రభుత్వం మారితే? జగన్ మళ్లీ వాటిని పక్కన పడేస్తారు. వందల కోట్లు పెట్టి విగ్రహాలు ఏర్పాటు చేయడంపై పాలకులు చూపుతున్న శ్రద్ధ, సామాన్య ప్రజలకు, రైతులకు అత్యవసరమైన ప్రాజెక్టులపై ఎందుకు చూపరు?
చూపకపోయినా ప్రజలు వాళ్లకే ఓట్లు వేసి అధికారం ఎందుకు కట్టబెడుతుంటారు? ఎవరికి వారు సమాధానాలు చెప్పుకోవాల్సిందే!




