కొన్నిసార్లు సినిమాలు విడుదలవుతున్నప్పుడు అనివార్య కారణాలతో వాయిదా పడుతుంటాయి. దాని వలన నిర్మాతలకి కొంత నష్టం జరిగినప్పటికీ తర్వాత సినిమా బాగా ఆడితే ఆ నష్టం భర్తీ అయిపోతుంది. కానీ రాజకీయ పార్టీలకు అలా సాధ్యం కాదు.
ఉదాహరణకు నవంబర్ 11న జూబ్లీహిల్స్ జరుగబోయే ఉప ఎన్నికల ప్రచారం గురించి చెప్పుకోవచ్చు. ఎన్నికలు దగ్గర పడుతున్నందున మూడు ప్రధాన పార్టీల ప్రధాన నేతలు జోరుగా ప్రచారంలో పాల్గొంటున్నారు.
ఈ సందర్భంగా నియోజకవర్గంలో ఓటర్లను ఆకర్షించేందుకు రోడ్ పక్కన టిఫిన్ కొట్టులో దోసెలు వేయడం, ఇస్త్రీ చేయడం వంటి చవుకబారు ప్రయత్నాలు చేయక తప్పడం లేదు.
ఈ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవడం కేటీఆర్కి చాలా ముఖ్యం. కనుక అయనతో సహా బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలందరూ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే తిరుగుతున్నారు.
సిఎం రేవంత్ రెడ్డి కూడా నవంబర్ 4 నుంచి ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. ఈ ఉప ఎన్నికలో గెలిచేందుకు మహమ్మద్ అజారుద్దీన్కి (శుక్రవారం) మంత్రి పదవి కట్టబెడుతూ రకరకాల వ్యూహాలతో బీఆర్ఎస్ పార్టీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు.
అధికార, ప్రతిపక్ష ముఖ్యనేతలందరూ బిజీగా ఉన్న ఇటువంటి కీలక సమయంలోనే తెలంగాణ రాష్ట్రంపై మొంథా తుఫాను విరుచుకుపడింది.
పలు జిల్లాలలో పట్టణాలు, పల్లెల్లు నీట మునిగాయి. మనుషులు, పశువులు, రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. వేలాది ఎకరాలలో పత్తి, మొక్కజొన్న పంటలు నీట మునిగాయి. కనుక తెలంగాణ ప్రజలు అల్లాడిపోతున్నారు.
కానీ మంత్రులు, ప్రధాన ప్రతిపక్ష నేతలు ఎవరూ జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి కాలు బయటపెట్టలేని పరిస్థితి నెలకొంది. ప్రజలను పరామర్శించడానికి వెళితే, ఓట్లు తారుమారయిపోయే ప్రమాదం పొంచి ఉంది. అలాగని ఎన్నికల ప్రచారంలోనే ఉండి పోతే వారిని చూసి ప్రజలు అసహ్యించుకుంటారు.
కష్టాలలో ఉన్న ప్రజలను పట్టించుకోకుండా జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నా తప్పకుండా గెలుస్తామనే గ్యారెంటీ లేదు ఎవరికీ. ఓడిపోతే ఇటు ఓటమి అప్రదిష్ట తప్పదు. అప్పుడు తాపీగా పరామర్శకు వెళితే ప్రజలు కూడా చీత్కరించుకుంటారు.
కనుక ఈ ఉప ఎన్నికలు కీలకు దశకు చేరుకుంటున్న ఈ సమయంలో విరుచుకుపడిన మొంథా తుఫాను ప్రభావం తెలంగాణలో మూడు పార్టీలపై కూడా ఎంతో కొంత తప్పక పడుతుంది.






