లిక్కర్ కేసులో దోషులు బయటే తిరుగుతున్నారు… వై?

Supreme Court Remarks on AP Liquor Scam Case

ఆంధ్రప్రదేశ్‌లో మద్యం కుంభకోణం కేసు నమోదు చేసి పలువురు వైసీపీ నేతలకు నోటీసులు, అరెస్టులు చేస్తున్నప్పుడు, వైసీపీ నేతలు “అసలు అదంతా ఓ కట్టు కధ. మా హయంలో ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదు. ఈ బూటకపు కేసు పేరుతో సిఎం చంద్రబాబు నాయుడు మమ్మల్ని వేధిస్తున్నారు,” అని వాదిస్తుంటారు.

అయితే మద్యం కుంభకోణంలో మొత్తం కధ అంతా రాజ్ కసిరెడ్డి చేతుల మీదుగానే నడిచిందని, ఈ కేసులో కర్త కర్మ క్రియ అన్నీ ఆయనే అని వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఎప్పుడో చెప్పేశారు.

ADVERTISEMENT

ఈ కేసులో 10 నెలల క్రితం అరెస్ట్ అయి జైల్లో ఉంటున్న రాజ్ కసిరెడ్డి అప్పటి నుంచి బెయిల్‌ కోసం చేయని ప్రయత్నం లేదు. హైకోర్టులో ఆయన బెయిల్‌ తిరస్కరించడంతో సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. అయితే అక్కడా తిరస్కరణకు గురయ్యారు. కానీ సుప్రీంకోర్టు అంతటితో సరిపెట్టలేదు.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం అతని తరపు న్యాయవాది వాదనలపై స్పందిస్తూ, “ఇదేమీ చిన్నా చితకా కేసు కాదు. చాలా పెద్ద కుంభకోణం. దీనిలో చాలా మంది అధికారులు కూడా కుమ్మక్కు అయ్యారు. వారి ప్రమేయం లేకపోతే అసలు ఇది జరిగే అవకాశమే లేదు. కానీ ఈ కేసు విచారణలో పురోగతి కనిపించడం లేదు. నేరస్తులు స్వేచ్చగా బయటే తిరుగుతున్నారు. కనుక అంతవరకు కసిరెడ్డిని లోపలే ఉండనీయండి,” అని నిష్కర్షగా చెప్పారు. కసిరెడ్డి తరపు న్యాయవాది అభ్యర్ధన మేరకు రెగ్యులర్ బెయిల్‌ పిటిషన్‌ ఉపసంహరించుకునేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది.

ఇంతకాలం ఈ కేసు పేరుతో మాకు రాజకీయ వేధింపులు అంటూ మొసలి కన్నీళ్ళు కార్చుతున్న వైసీపీ నేతలు ఇప్పుడు సుప్రీంకోర్టు చేసిన ఈ వ్యాఖ్యలపై స్పందించగలరా? ఇప్పుడు కూడా మద్యం కుంభకోణం కట్టుకధ అని వాదించగలరా?

ఈ కేసు విచారణలో పురోగతి కనిపించడం లేదని, నేరస్తులు బహిరంగంగా తిరుగుతున్నారంటూ సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ఏపీ ప్రభుత్వానికి కూడా చురకలు వేసినట్లే! కనుక ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం అంతిమ లబ్దిదారు వరకు చేరుకోగలదా లేక మరో రెండేళ్ళు ఇలాగే కాలక్షేపం చేసేస్తుందా? చూడాలి!

ADVERTISEMENT
Latest Stories