సుప్రీంకోర్టు తీర్పు: బీఆర్ఎస్‌ ఇక బాజా వాయించుకోవచ్చు!

Supreme Court Verdict Boosts BRS Morale

అనేక అంతర్గత, బాహ్య రాజకీయ, కుటుంబ సమస్యలతో సతమతమవుతున్న తెలంగాణలోని బీఆర్ఎస్‌ పార్టీకి సుప్రీంకోర్టు తాజా తీర్పు ఆక్సిజన్ అందించి ఊపిరి పోసింది.

శాసనసభ ఎన్నికలలో బీఆర్ఎస్‌ పార్టీ ఓడిపోయిన తర్వాత ఆ పార్టీ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ పార్టీలోకి మారారు. వారిపై 3 నెలల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

ADVERTISEMENT

గతంలో కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్‌, టీడీపి ఎమ్మెల్యేలను తన పార్టీలోకి రప్పించుకొని మంత్రి పదవులు కూడా ఇచ్చారు. నేటికీ తలసాని, కడియం వంటి పలువురు టీడీపి నేతలు బీఆర్ఎస్‌ పార్టీలోనే ఉన్నారు.

వారిని తమ పార్టీలో చేర్చుకోవడం తప్పుగా భావించని కేసీఆర్‌, తమ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ పార్టీలో చేరితే అప్రజాస్వామికం అంటూ పార్టీ నేతల చేత హైకోర్టు, సుప్రీంకోర్టులో పిటిషన్లు వేయించారు.

వాటిపై విచారణ చేపట్టిన సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలో ధర్మాసనం మూడు నెలల్లోగా 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలపై తెలంగాణ శాసనసభ స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని గడువు విధించింది.

అనేక సమస్యలతో సతమతమవుతున్న బీఆర్ఎస్‌ పార్టీకి సుప్రీంకోర్టు తాజా తీర్పు చాలా ఉపశమనం కలిగించేదే. కనుక “ఇది మా నైతిక విజయం… కాంగ్రెస్‌ పార్టీకి చెంప దెబ్బ… మూడు నెలల్లో ఉప ఎన్నికలు…” అంటూ బాజా వాయించడం మొదలు పెట్టేసింది.

వరద ప్రవాహంలో కొట్టుకుపోతున్న వ్యక్తికి గడ్డిపోచ దొరికినా దానిని పట్టుకొని ఒడ్డున పడాలని ఆశపడినట్లే, బనకచర్ల-చంద్రబాబు నాయుడు-రేవంత్ రెడ్డి పాటతో కాలక్షేపం చేస్తున్న బీఆర్ఎస్‌ పార్టీకి కూడా, ఈ తీర్పు తమ సమస్యల నుంచి ఒడ్డున పడేస్తుందని ఆశ పడటం సహజం.

ఈ తీర్పుతో తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వానికి కాస్త ఇబ్బందికరమే కానీ ఇప్పటికిప్పుడు వచ్చే ప్రమాదం ఏమీ లేదనే చెప్పాలి. మూడు నెలలని మరో ఆరు నెలలు సాగదీయడం కాంగ్రెస్‌ పార్టీకి పెద్ద కష్టమైన పనేమీ కాదు.

ఒకవేళ రాజకీయంగా రాష్ట్రంలో పరిస్థితి అనుకూలంగా ఉందని భావిస్తే ఆ ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించి ఉప ఎన్నికలకు వెళ్ళి బీఆర్ఎస్‌ పార్టీని మరోసారి దెబ్బ కొట్టినా ఆశ్చర్యం లేదు.

ADVERTISEMENT
Latest Stories