తమిళ స్టార్ హీరోల్లో ఒకరైన సూర్య తాజా చిత్రం “వీరభద్రుడు” ఈవారం విడుదలవుతుంది. గతేడాది విడుదలవ్వాల్సిన సినిమా ఇది. తమిళ కమెడియన్ ఆర్జే బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం పలుమార్లు వాయిదాపడి ఎట్టకేలకు మే 14న తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదలవుతోంది. త్రిష హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంపై ప్రస్తుతానికి పెద్దగా అంచనాలైతే లేవు.
అయితే.. నిన్న హైదరాబాద్ లో జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్లో దర్శకుడు బాలాజీ మాట్లాడుతూ.. “ఇది థియేటర్ల కోసం తీసిన సినిమా, సోషల్ మీడియాలో డైసెక్ట్ చేసేవాళ్ల కోసం తీసింది కాదు. చీకటి గదిలో తెరపై మాత్రమే ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారు” అని ఇచ్చిన స్టేట్మెంట్ సినిమాపై లేనిపోని అనుమానాలకు తావిచ్చింది.
థియేటర్ కోసం ఒక సినిమా, సోషల్ మీడియా కోసం మరో సినిమా తీయరు కదా. థియేటర్లలో బాగా వర్కవుట్ అయ్యి, ఓటీటీకి వచ్చేసరికి భిన్నమైన రెస్పాన్స్ వచ్చిన సినిమాలు చాలా ఉన్నాయి. “జాతిరత్నాలు” కూడా అలాంటి పరిస్థితి చవిచూడాల్సి వచ్చింది. కానీ.. అప్పుడు కూడా ఫిలిం మేకర్స్ ఆడియన్స్ పైన తప్పు రుద్దలేదు.
కానీ.. ఇప్పుడు బాలాజీ రిలీజ్ కి ముందే ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం అనేది చర్చనీయాశంగా మారింది. మరి సినిమా కంటెంట్ మీద నమ్మకం లేక అలా అన్నాడా? లేక సోషల్ మీడియాలో ఈ సినిమా ట్రోల్ అవ్వడం కన్ఫర్మ్ అని అర్థమై.. ముందే ఫ్యాన్స్ ను ప్రిపేర్ చేస్తున్నాడా? అనేది గురువారం ఉదయం ఆటతో తెలిసిపోతుంది.




