ఎన్నికల సమయంలో ప్రత్యర్ధి పార్టీ తమ అభ్యర్ధుల జాబితా విడుదల చేస్తే వారిని ఓడించగల బలమైన అభ్యర్ధులను బరిలో దింపాలనుకుంటాయి. ఒక్కోసారి నామినేషన్స్ గడువు దగ్గర పడేవరకు అలా ఒకరి జాబితా కోసం మరొకరు ఎదురు చూస్తూనే ఉంటారు.
అదేవిధంగా వైఎస్ షర్మిల కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఏపీకి తిరిగి వచ్చి అన్నపై ప్రత్యక్ష యుద్ధం మొదలుపెట్టినప్పుడు, సింపతీ లెక్కలు మొదలయ్యాయి. చంద్రబాబు నాయుడు లేదా పవన్ కళ్యాణ్ లేదా వాళ్ళ ఇళ్ళలో ఆడవాళ్ళ గురించి చులకనగా మాట్లాడినట్లు షర్మిలని ఉద్దేశ్యించి మాట్లాడలేని పరిస్థితి.
మాట్లాడితే ఆమెకు ప్రజల సానుభూతి లభిస్తుంది. రాజకీయంగా లబ్ది కలుగుతుంది. కానీ ఆమెను ధీటుగా ఎదుర్కోకపోతే రాజకీయంగా నష్టపోతామని లోలోన భయం కూడా ఉంది.
అదేవిధంగా ఆమె కూడా అన్న తనని, తన బిడ్డలని అన్యాయం చేశాడంటూ చెప్పుకుంటూ ప్రజల సానుభూతి పొందాలని ప్రయత్నించారు.
కానీ ఈ సానుభూతి లెక్కలు ఇద్దరికీ ఫలించలేదు. ఆమె వలన జగన్, జగన్ వలన ఆమె రాజకీయంగా నష్టపోయారు.
ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్-టీఆర్ఎస్ పార్టీలు కూడా ఈ సానుభూతి లెక్కలు కట్టుకుంటున్నాయి. ఆమె పార్టీ నుంచి బహిష్కరించబడిన తర్వాత కొన్ని రోజులు తండ్రి ఫోటో, పేరు చెప్పుకునే జాగృతితో రాజకీయాలు చేశారు.
కానీ తండ్రి పట్టించుకోకపోవడంతో మొదట హరీష్ రావు, ఇతర నేతలు, తర్వాత కేటీఆర్, ఇప్పుడు నేరుగా తండ్రినే విమర్శిస్తున్నారు.
కనుక మళ్ళీ సానుభూతి లెక్కలు కట్టుకోక తప్పడం లేదు. తండ్రి, అన్న, బావ (హరీష్ రావు) అందరూ కలిసి ఈ ఆడబిడ్డ అన్యాయం చేశారని కవిత కన్నీళ్ళు పెట్టుకొని ప్రజల సానుభూతికి ప్రయత్నించారు. మెల్లగా కొందరిని కూడగట్టుకొని పార్టీ ఏర్పాటు చేసుకున్నారు.
కనుక ఇప్పుడు ఓ రాజకీయ పార్టీ అధినేతగా మరో పార్టీ అధినేత (కేసీఆర్)ని విమర్శిస్తున్నాను తప్ప ఓ కూతురుగా తండ్రిని కాదని వాదిస్తున్నారు. కనుక ఆమె చేస్తున్న ఈ డబుల్ రోల్ ప్రజలే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.
ఇక్కడ షర్మిలతో జగన్ ఎదుర్కొంటున్న ఇబ్బందినే అక్కడ కేసీఆర్, కేటీఆర్ కూడా ఎదుర్కొంటున్నారు. కనుక ఇక్కడ జగన్ కనిపెట్టిన ఫార్ములాని వారు కూడా వాడుకోవచ్చు. కవితని ఏ మాత్రం పట్టించుకోకుండా తమ సోషల్ మీడియా వారియర్స్ (వారినే కాలకేయ సైన్యం అని షర్మిల, కవిత అభివర్ణిస్తుంటారు) ద్వారా ఎదుర్కోక తప్పడం లేదు.
ఏది ఏమైనప్పటికీ ఇలా ప్రతీ సమస్యకి ఓ ఫార్మాట్ లేదా ఫార్ములా ఉంటే ఎంత బాగుంటుందో కదా? అనిపిస్తుంది. కానీ ఇన్ని సింపతీ లెక్కలు కట్టుకున్నాక అందరూ మునిగితేనే బాధ!




