చెన్నై అపోలో ఆసుపత్రిలో క్రమంగా కోలుకుంటున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత స్వయంగా ఆహారం తీసుకుంటున్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఆమె మంచినీరు తాగుతున్నారని, ఉడకబెట్టిన యాపిల్ పళ్లు కూడా తింటున్నారని వైద్యులు వివరించారు. తనకు ఇంతకాలం పాటు చికిత్సను అందించిన వైద్యులకు ఆమె పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారని డాక్టర్లు వివరించారు.
లండన్ కు చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ బీలే దాదాపు రెండు గంటల పాటు ఆమె వద్దే ఉండి, కోలుకుంటున్న తీరును పరిశీలించారని వివరించారు. సింగపూర్ వైద్య నిపుణులు ఆమెకు ఫిజియో థెరపీ చేయిస్తున్నారని తెలిపారు. ఇక, జయలలిత మరింత త్వరగా కోలుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా ఏఐఏడీఎంకే కార్యకర్తలు, అభిమానుల పూజలు కొనసాగుతున్నాయి.
5008 మంది మహిళలు పాల బిందెలను ఎత్తుకుని అమ్మవారి ఆలయానికి వెళ్లి పూజలు జరిపారు. ఈ కార్యక్రమం హోసూరు తాలూకా బాగలూరు మరియమ్మాళ్ ఆలయం వద్ద రాష్ట్ర మంత్రి బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో సాగింది. కన్యాకుమారి ప్రాంతానికి చెందిన ఓ కార్యకర్త ఆసుపత్రి వద్ద నిరాహారదీక్ష చేస్తూ శ్రీరామకోటి రాస్తున్నాడు.



