రాజకీయాలలో తల పండిన జమ్మూ కాశ్మీర్ మాజీ సిఎం ఫారూఖ్ అబ్దుల్లా తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాలలో బిజేపి ఓటమి, ఇండియా కూటమికి విజయం తధ్యమని జోస్యం చెప్పారు.
బెంగాల్లో మమతా బెనర్జీ, తమిళనాడులో స్టాలిన్ తిరిగి అధికారంలోకి వస్తారని, కేరళలో కాంగ్రెస్ ఫ్రంట్ తప్పక గెలుస్తాయని ఫారూఖ్ జోస్యం చెప్పారు.
అయితే ఈసారి తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో అనూహ్యంగా ఓటింగ్ శాతం దేనివల్ల పెరిగిందని ఆలోచిస్తే బెంగాల్లో బిజేపి చాలా తీవ్రంగా ప్రయత్నించడం, తమిళనాడులో టివికే పార్టీతో విజయ్ ఎన్నికల బరిలో దిగడం కారణాలుగా కనిపిస్తాయి.
కనుక ఈ రెండు రాష్ట్రాలలో ఇంత తీవ్రమైన పోటీ ఉన్నప్పుడు అధికార తృణమూల్ కాంగ్రెస్, డీఎంకేలు పూర్తి మెజార్టీతో అధికారంలోకి రాగలవని భావించడం అసంబద్దంగా అనిపిస్తుంది.
ముఖ్యంగా టివికే పార్టీ ఈ ఎన్నికలలో గెలవలేకపోయినా తప్పకుండా డీఎంకే, అన్నాడీఎంకేల ఓట్లను చీల్చడం ఖాయం.
మరోపక్క జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకేలో నాయకత్వ సమస్య ఏర్పడగా, నేతల కీచులాటల కారణంగా దాని పూర్వ వైభవం కోల్పోయింది. ఇదే సమయంలో సిఎం స్టాలిన్ నాయకత్వంలో డీఎంకే చాలా బలంగా ఉంది.
కనుక ఈ వాస్తవ పరిస్థితులను, రాజకీయ బలాబలాలు, కుల సమీకరణాలు అన్నిటినీ పరిగణనలోకి తీసుకొని వాస్తవ దృష్టితో చూసినట్లయితే మళ్ళీ డీఎంకే పార్టీయే అధికారం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కానీ విజయ్ ఎంట్రీ వలన బొటాబొటి మెజార్టీ లేదా మెజార్టీకి కాస్త దూరంలో నిలిచిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. కనుక డీఎంకే అతిపెద్ద పార్టీగా అవతరించి టివికే పార్టీ మద్దతుతో మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది.
పశ్చిమ బెంగాల్ కథ మరోసారి చెప్పుకుందాం.




