ఇటీవల ఎన్నికలు జరిగిన నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి ఫలితాలపై వివిధ సర్వే సంస్థలు తమ ముందస్తు అంచనాలు (ఎగ్జిట్ పోల్స్) ప్రకటించాయి. అస్సాం, పుదుచ్చేరిలో బిజేపి, కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలో యూడీఎఫ్ రావచ్చని పేర్కొన్నాయి. కానీ కీలకమైన తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశాయి.
తమిళనాడులో పూర్తి మెజార్టీతో మళ్ళీ డీఎంకే అధికారంలోకి వస్తుందని కొన్ని సర్వేలు చెప్పగా, ఈసారి డీఎంకే, అన్నాడీఎంకే, డీఎంకే-విజయ్ టివికే పార్టీలకు సరిసమానంగా సీట్లు రావచ్చని మరికొన్ని పేర్కొన్నాయి.
మరో సర్వేలో అన్నాడీఎంకే-డీఎంకేలకు సరిసమానంగా సీట్లు వస్తాయని, టివికే పార్టీకి 18-28 సీట్లు రావచ్చని పేర్కొన్నాయి. ఈ లెక్కన తమిళనాడులో విజయ్ కింగ్ మేకర్ అయ్యే అవకాశం ఉంది.
ఈసారి తమిళనాడులో చాలా భారీగా పోలింగ్ నమోదవడం గమనిస్తే అది ఖచ్చితంగా టివికే పార్టీ బరిలో దిగడం వల్లనే అని అర్ధమవుతుంది. బహుశః అందువల్లే టీవీకే పార్టీకి 67-81 సీట్లు రావచ్చని కామాఖ్య సర్వే అంచనా వేయగా యాక్సిస్ మై ఇండియా 98-120 సీట్లు తప్పక వస్తాయని చెపుతోందనుకోవచ్చు.
దిగువ టేబిల్ ప్రకారం మొత్తం 10 సర్వేలలో 6 సర్వేలు డీఎంకే పూర్తి మెజార్టీతో మళ్ళీ అధికారంలోకి వస్తుందని చెప్తున్నాయి. మే 4న ఫలితాలు వెలువడి తమిళనాడులో ఎవరు అధికారంలోకి వస్తారో స్పష్టమవుతుంది.





