గత అనుభవాలు నేర్పిన పాఠాలు….ప్రతిపక్షాలు గుర్తుంచుకోవాలిగా..!

TDP Janasena

గత ప్రభుత్వంలో ఉన్న టీడీపీ పార్టీ తానూ చేసిన అభివృద్ధిని కూడా ప్రజలకు చెప్పలేకపోయింది. అలాగే ప్రజలను మెప్పించలేకపోయింది. అధికారం వచ్చిన ఐదు సంవత్సరాలలో రాజధాని అభివృద్ధికి చేయగలిగిందంతా మా ప్రభుత్వం చేసింది అంటూ అమరావతిలో కట్టిన నిర్మాణాలను కూడా ప్రజలకు తెలియచేయలేకపోయింది టీడీపీ ప్రభుత్వం. అలాగే కేంద్ర ప్రభుత్వ సహకారం లేకపోయినా పోలవరం నిర్మాణం కొనసాగించింది.

సాధారణంగా ఒక మల్టీ ఫ్లక్స్ నిర్మించాలంటేనే దాదాపు రెండు మూడేళ్ళ సమయం పడుతుంది. అలాంటిది ఒక రాష్ట్ర రాజధాని నిర్మాణం ఒక ఐదు సంవత్సరాలలో ఎలా పూర్తి చేయగలం అనేదానిని ప్రజలకు అర్ధమయ్యే విధంగా చెప్పడంలో అప్పటి టీడీపీ ప్రభుత్వం కచ్చితంగా ఫెయిల్ అయ్యిందనే చెప్పాలి.ప్రజలు కూడా ఐదు సంవత్సరాలలో అద్భుతాలు జరిగిపోవాలంటూ ఆశపడడం కూడా అత్యాశే అవుతుంది.

ADVERTISEMENT

గత ప్రభుత్వ నిస్తేజాన్ని, ప్రజల ఆరాటాన్ని అవకాశంగా తీసుకున్న వైసీపీ పార్టీ తన గెలుపుకి రాజ బాట వేసుకోవడంతో విజయం సాధించింది. అలాగే పొత్తులో భాగంగా టీడీపీ ప్రభుత్వంలో భాగస్వామి అయిన బీజేపీ కూడా రాష్ట్ర అభివృద్ధికి సహకరించకపోవడం, అలాగే టీడీపీ – బీజేపీ ప్రభుత్వానికి మద్దతిచ్చిన జనసేన పవన్ కళ్యాణ్ కూడా తానిచ్చిన మద్దతుని ఉపసంహరించుకుని ప్రభుత్వం పైనే ఎదురుదాడి చేయడం వైసీపీ పార్టీకి వరంలా మారింది.

ఇలా ఎవరివంతు సాయం వారు చేసి వైసీపీ పార్టీ గెలుపుకి కృషి చేశారు. గతంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన ప్రతి విమర్శను వైసీపీ తన వైపు మరల్చుకోగలిగింది. ఇప్పుడు టీడీపీ – జనసేన పార్టీల నేతలు ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలను ప్రజలలోకి తీసుకెళ్లటంలో అలసత్వం చూపిస్తున్నారు అనే విమర్శను ఎదుర్కుంటున్నారు. చంద్రబాబు అరెస్టుతో మూడు నెలల విలువైన ప్రతిపక్ష పార్టీ సమయాన్ని వృధా చేసుకున్న రెండు పార్టీలు ఇప్పటికైనా గెలుపుకి అవసరమైన వేగం పెంచలేదని చెప్పాలి.

తెలంగాణలో ఎన్నికల సమయానికి ముందే కాంగ్రెస్ పార్టీ ప్రజలలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే అనే నమ్మకాన్ని, అధికార పార్టీలో ఇక మీరు ప్రతిపక్షానికే పరిమితం అనే భయాన్ని బలంగా తీసుకెళ్లగలిగింది. కానీ ఏపీలో ప్రస్తుతానికి ప్రతిపక్షాలు ఆ దిశగా ప్రభుత్వాన్ని కదిలించలేకపోతున్నాయి. ఇంకా ఎన్నికలకు వంద రోజుల సమయమే మిగిలుంది.టీడీపీ నేతల మీద కేసులతో వైసీపీ ప్రభుత్వం టీడీపీ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. అలాగే తాను బయటకొచ్చి ప్రభుత్వ తీరుపై విమర్శ చేస్తే దాని ప్రభావం ఎలా ఉంటదో తెలిసిన పవన్ అందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధంచేయరు.

వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి ప్రతిపక్ష పార్టీలకు చాలా అవకాశాలే ఇచ్చారు ముఖ్యమంత్రి జగన్.రాష్ట్రంలో రోడ్ల అవస్థల నుండి రైల్వే లైన్ల వరకు,ప్రత్యేక హోదా నుండి రాజధాని నిర్మాణం వరకు, ఋషి కొండ నుండి మద్యం అమ్మకాలు, అలాగే మంత్రుల బూతుపురాణాలు ఇలా ఎన్నో అంశాల మీద ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి , రోడ్ల మీదకు వచ్చి నిరసనలు తెలపడానికి అవకాశం ఇచ్చింది వైసీపీ ప్రభుత్వం.

అయితే ప్రతిపక్షాలు చేస్తున్న ఈ నామమాత్రం పోరాటాలతో వైసీపీ ప్రభుత్వంలో కదలిక లేదు. రానున్న ఈ వంద రోజులు టీడీపీ – జనసేన ఒకరికొకరు తన బలాన్ని పంచుకుంటూ స్పీడ్ పెంచి నిత్యం ప్రజల మధ్యే ఉంటూ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి ప్రజావ్యతిరేక నిర్ణయాల మీద బలంగా పోరాడాల్సిన బాధ్యత ప్రతి ప్రతిపక్ష నేతమీద ఉంటుంది.

ముఖ్యంగా మాస్ లీడర్ గా గుర్తింపు ఉన్న బాబు, పవన్, లోకేష్ గత అనుభవాలు చెప్పిన పాఠాలనుండి తమ ఓటమికి కారణాలు వెతికి వాటిని పునరావృత్తం కాకుండా తగిన చర్యలు తీసుకుని రాష్ట్రమంతా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాల మీద ఉమ్మడి పోరాటాలు చేస్తేనే ఇరుపార్టీలు అనుకున్న ఉమ్మడి లక్ష్యం నెరవేరుతుందని గ్రహించాలి.

ADVERTISEMENT
Latest Stories