టీడీపీ – జనసేన పొత్తు ఉంటుందా? లేదా? అన్న నిమాంసకు తెర దింపిన ఇరుపక్షాల నేతలు అధికార పక్షాన్ని నివారించడం ఒక ఎత్తైతే స్వపక్షాన్ని సమన్వయ పరచడం మరో ఎత్తుగా మారుతుందనే విషయాన్ని పరిగణలోనికి తీసుకోవాలి. పొత్తు అంటేనే ఇరు పక్ష నేతలు త్యాగానికి సిద్ధంగా ఉండడం అనే అర్ధం. టీడీపీ ఎన్ని సీట్లలో పోటీ చేస్తుంది, జనసేనకు ఎన్ని సీట్లు సర్దుబాటుకు నేతలను ఒప్పించగలదు అనేది అటు టీడీపీ కి ఇటు జనసేన కు పెద్ద సమస్యగా మారనుంది.
సొంత పార్టీ నేతలను త్యాగాలకు సిద్ధం చేయాలి….పక్క పార్టీ నేతల గెలుపుకి కృషి చేయాలి… ఇదే పొత్తు ధర్మం! రెండు పార్టీల కార్యకర్తలు పొత్తు ధర్మంలో ముందుకు వెళ్లగలిగితే అంతిమ విజయం పొందగలుగుతారు. పొత్తులో భాగంగా తొలి పోరు తెనాలి నుండే మొదలైనట్టు సమాచారం. జనసేనకు అత్యంత కీలకమైన నేత నాదెండ్ల మనోహర్ 2014 ఎన్నికలలో పోటీ చేసి ఓడిన నియోజకవర్గం తెనాలి.
టీడీపీ నుండి ఆలపాటి రాజా కూడా తెనాలి పై ఆసక్తి గా ఉన్నారు. అయితే గత ఎన్నికలలో కూడా ఇరు పార్టీల ఓట్ల చీలిక వైసీపీ విజయానికి రూట్ క్లియర్ చేసిందనే చెప్పాలి. పొత్తులో భాగంగా టీడీపీ కి మంచి పట్టున్న గుంటూరు వెస్ట్ కు నాదెండ్లను పోటీకి నిలిపి తెనాలి సీటు ఆలపాటి రాజాకు ఇస్తారంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. అంతర్గత సర్వేల నివేదిక కూడా రాజా కు అనుకూలంగా ఉందన్నట్లు వార్తలు వినపడుతున్నాయి.
ఎవరు ఎక్కడ పోటీ చేసిన వారిని తమ ఉమ్మడి అభ్యర్థిగా ఒప్పుకొని ఉమ్మడి శత్రువు ఓటమే అంతిమ లక్ష్యంగా పని చేసిన నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తమ తమ జెండాలను సగర్వంగా ఎగరేసి తమ తమ ఉమ్మడి అజెండాను అమలుచేయవచ్చు.రెండు పార్టీలు పట్టు విడుపులతో ముందుకు వెళ్లపోతే మళ్ళి 2019 స్టోరీ రీపీట్ అవుతుందనేది ‘జగమెరిగిన’ సత్యం.



