ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టిడిపి ముఖ్య నేతలపై రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. ఓ పద్దతి ప్రకారం వారి ఆర్ధిక మూలాలను దెబ్బ తీస్తూ వారిని టిడిపికి, రాజకీయాలకు దూరం చేయాలని ప్రయత్నిస్తూనే ఉంది. ఆ వేధింపులు, అవమానాలు భరించలేక మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివ ప్రసాద్ ఆత్మహత్య చేసుకొని చనిపోయిన సంగతి తెలిసిందే.
ఆ తర్వాత వైసీపీ వ్యూహం మార్చి టిడిపి అగ్రనేతలను టార్గెట్ చేసుకొని వారి నియోజకవర్గాలలోనే ఓడించేందుకు పావులు కదుపుతోంది. చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంపై గురిపెట్టిన సిఎం జగన్మోహన్ రెడ్డి పదేపదే అక్కడికి పర్యటిస్తూ, నియోజకవర్గం అభివృద్ధికి భారీగా నిధులు విడుదల చేస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు.
ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం టిడిపి మీడియా ప్రతినిధులను లక్ష్యంగా చేసుకొని వేధిస్తూ వారిని టిడిపికి పనిచేయకుండా అడ్డుకోవాలని విశ్వప్రయత్నాలు చేస్తోంది. కొని రోజుల క్రితం జర్నలిస్ట్ అంకబాబుని ఏదో కుంటిసాకుతో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
ఇటీవల హైదరాబాద్లో నివాసం ఉంటున్న టిడిపి నేత చింతకాయల విజయ్ ఇంట్లోకి ఏపీ సిఐడీ పోలీసులు ప్రవేశించి హడావుడి చేసిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నందుకు ఆయనకు కూడా నోటీస్ ఇచ్చి విచారణకు హాజరుకావలసిందిగా ఆదేశించారు.
తాజాగా టిడిపి మీడియా ప్రతినిధి దారపనేని నరేంద్రను ఏపీ సిఐడి పోలీసులు బుదవారం అరెస్ట్ చేశారు, గుంటూరులో అరండల్పేటలో యాంగంటి అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న ఆయన ఇంటికి బుదవారం సాయంత్రం 6.30 గంటలకు ఎడుగురు సీఐడీ పోలీసులు మఫ్టీలో వచ్చి ఆయనను సుమారు 2 గంటల పాటు ప్రశ్నించిన తర్వాత అరెస్ట్ చేసి తమతో తీసుకుపోయారు. తన భర్తకు ఎటువంటి నోటీసు ఇవ్వకుండా పోలీసులు అరెస్ట్ చేసి తీసుకుపోయారని నరేంద్ర భార్య సౌభాగ్యం మీడియాకు తెలిపారు.
నరేంద్రను అరెస్ట్ చేసిన విషయం తెలియగానే టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఆయన భార్య సౌభాగ్యంకు ఫోన్ చేసి మాట్లాడి ధైర్యం చెప్పారు. మీ కుటుంబానికి టిడిపి అండగా నిలబడుతుందని భరోసా ఇచ్చారు.
అనంతరం నరేంద్ర అరెస్ట్పై స్పందిస్తూ, “ఈ ప్రభుత్వానికి, పోలీసులకు హైకోర్టు ఎన్నిసార్లు చివాట్లు పెట్టినా వారి తీరు మారడం లేదు. గతంలో అంకబాబుని అరెస్ట్ చేసినప్పుడు కోర్టు చీవాట్లు పెట్టిన సంగతి అప్పుడే మరిచిపోయి నరేంద్రను అరెస్ట్ చేశారు. కనుక కోర్టులో మళ్ళీ మొట్టికాయలు తినక తప్పదు. నరేంద్రను తక్షణం బేషరతుగా విడుదల చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను,” అని చంద్రబాబు నాయుడు అన్నారు.



