తెలంగాణ రాష్ట్ర సమితి తెలుగు దేశం పార్టీ పొత్తు పెట్టుకుని 2019 ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ఆ మధ్య పుకార్లు షికారు చేసాయి. చివరికి ఆ పొత్తు గొడవ చినికి చినికి గాలి వాన అయ్యి రేవంత్ రెడ్డి పార్టీ వదిలి పోయేదాకా వెళ్ళింది. ఆ పుకార్లు వచ్చిన సమయంలో చంద్రబాబు కేసీఆర్ మౌనం పాటించడం మరిన్ని అనుమానాలకు తావిచ్చింది.
అయితే అసలు రెండు పార్టీలు పొత్తు ప్రతిపాదనలు చేశాయో లేక తరువాత చెందిందో తెలీదు గానీ తెలంగాణ రాష్ట్ర సమితి మళ్ళి టీడీపీ పై ఆపరేషన్ ఆకర్ష ప్రయోగిస్తోంది. తెదేపా రాష్ట్ర కార్యదర్శి కంచర్ల భూపాల్రెడ్డి, ఆయన సోదరుడు కృష్ణారెడ్డి, ఆ పార్టీ మండలాధ్యక్షులు, ఎంపీటీసీలు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో సోమవారం తెలంగాణభవన్లో కేటీఆర్ తెరాసలో చేరారు.
ఈ సంధర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణలో తెదేపా చచ్చిపోయిందనీ, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒకటే స్థానం గెలిచి ఆ పార్టీ ఆంధ్రాకు పరిమితమైందనీ, రాష్ట్రంలో తమకిక ఏకైక శత్రువు కాంగ్రెస్ పార్టీయేనని, నల్గొండ సహా అన్ని జిల్లాల్లో ఆ పార్టీని చిత్తుగా ఓడిస్తామని పేర్కొన్నారు.
పొత్తు ప్రతిపాదన ఉంటే ఇలా టీడీపీ నుండి వలసలు ప్రోత్సహించడం జరగదు కనుక అయితే అసలు అలాంటి ప్రతిపాదన లేకుండా ఉండొచ్చు లేకపోతే రేవంత్ రెడ్డి పార్టీ ని విడిచిపెట్టి వెళ్ళాక పరిణామాలు మారి రెండు పార్టీల మధ్య చెడి ఉండవచ్చు. వీటి అన్నిటి మధ్య టీడీపీ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో చూడాలి!


