ఈసారి గెలుపు గుర్రాలకే పార్టీ టికెట్ అంటూ మార్పులు చేర్పులతో వైసీపీ నాయకులలో తీవ్ర అసంతృప్తిని, అసహనాన్ని సృష్టిస్తున్నారు ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికే ఆశించిన స్థానంలో తమకు సీటు దక్కలేదని అధిష్టానం పై అలకపూనిన నాయకులు ఎవరి దారి వారు చూసుకుంటున్నారు.
కొందరు సైకిల్ ఎక్కి చంద్రబాబుకి మద్దతుగా నిలబడితే, మరికొందరు గాజు గ్లాస్ పట్టుకోవడానికి పవన్ చెంతకు చేరుతున్నారు. ఈ రెండు పార్టీలలో చేరే అవకాశం లేని వారు అన్న వదిలిన బాణం కాంగ్రెస్ చేతికి చిక్కడంతో షర్మిల వెంట నడవడానికి మొగ్గు చూపుతున్నారు.
కొన్ని రోజులుగా ప్రజాక్షేత్రంలో కానీ మీడియా ముందుకు కానీ రాని పవన్ కళ్యాణ్ తెరవెనుక పార్టీ బలోపేతానికి తనవంతు ప్రయత్నాలు మొదలుపెట్టారని టాక్. కాపు ఉద్యమ నేతగా పేరు సంపాదించుకున్న ముద్రగడతో మంతనాలు, హరిరామ జోగయ్య తో మాటామంతిలు, ఉత్తరాంధ్రకు చెందిన కాంగ్రెస్ సీనియర్ లీడర్ మాజీ మంత్రి కొణతాల రామకృష్ణతో చర్చలు దానిలో భాగమనే చెప్పాలి.
వైసీపీ అధిష్టానం ఇంచార్జ్ ల మార్పు లో భాగంగా గూడూరు వైసీపీ టికెట్ మేరిగ మురళి కి కేటాయించడంతో అక్కడి వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే వరప్రసాద్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు.దీనితో ఆయన వైసీపీ పార్టీ వీడి జనసేనలో చేరబోతున్నారంటూ వార్తలు మొదలయ్యాయి. అలాగే సినీ రంగానికి చెందిన ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కూడా ఈ రోజు మంగళగిరి పార్టీ ఆఫీసులో పవన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు.
ఇప్పటికే టీడీపీ సొంత పార్టీ నేతలు, వలస వచ్చిన నేతలతో తలకు మించిన నాయకులతో సైకిల్ బోయలేని భారం మోస్తున్న తరుణంలో పొత్తులో భాగంగా జనసేనకు దక్కే సీట్లలో పోటీచేయడానికి ముందుగానే కర్చీఫ్ వేసుకుంటున్నారు నేతలు. అయితే పార్టీలో చేరికలు ఎంత ముఖ్యంమో అలాగే ప్రజాక్షేత్రంలో పోరాటాలు అంతకంటే ముఖ్యమని పవన్ ఇప్పటికైనా గ్రహించాలి.
ఎన్నికలకు ఇంకా సుమారు రెండు నెలల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో ఇంకా బయటకు రాకుండా మోనంగా సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వానికి ప్రశ్నలు సందిస్తే ఎలా..? పొత్తులో పోటీ చేసే స్థానాలపై ఇప్పటికి ఇరు పార్టీలు ఆయా పార్టీల నేతలకు, కార్యకర్తలకు ఒక క్లారిటీ ఇవ్వలేదు.
చివరి నిముషం దాక సమస్యను సాగదీసి ఆఖరి నిముషంలో పార్టీలో అసమ్మతులతో అధికార పార్టీకి అవకాశం కల్పించడం అవసరమా..? వైసీపీ ఇప్పటికే నియోజకవర్గాల ఇంచార్జ్ లను నియమిస్తూ వస్తున్న అసమ్మతిని తొలగించుకుంటూ ఎన్నికల నాటికీ ప్రతిపక్షాలను టార్గెట్ చేయడమే పనిగా పెట్టుకుంటుంది. కానీ టీడీపీ జనసేన లు మాత్రం పార్టీ నేతలను సర్దుబాటు చేసే పనిలో అసలు పనిని పక్కన పెట్టే అవకాశం లేకపోలేదు.
ఇప్పటికే షర్మిల కాంగ్రెస్ పార్టీ తరుపున ప్రచార బరిలో దిగి ప్రభుత్వం పై విరుచుకుపడుతున్నారు. పరీక్షలు రాసే విద్యార్థులకు ప్రతి నిముషం ఎలా విలువైనదో రాజకీయాలలో ప్రత్యర్థిని ఎదిరించి యుద్ధం చేయడానికి సిద్దమైనప్పుడు ఇలా మీన మేషాలు లెక్కిస్తూ, మంచి ముహుర్తాలు చూసుకుంటూ కాలం వెళ్లబుచ్చితే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం నిముషం ఆలస్యం అయినా చేసిన త్యాగాలు, ప్రయత్నాలు, శ్రమ బూడిదలో పోసిన పన్నీరే అనేది ఇరు పార్టీలు గుర్తించాలి.




