తేజస్వి వ్యాఖ్యలు: టి. బీజేపీ కి తాకిన సెగలు…

Tejasvi Remarks Row

బీజేపీ కర్ణాటక ఎంపీ పార్లమెంట్ లో చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో మంట రేపుతున్నాయి. పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన నియోజకవర్గాల పునర్విభజన బిల్లు పై ప్రసంగించిన తేజస్వి ఈ బిల్లు పై కాంగ్రెస్ వైఖరిని తప్పుబడుతూ డీలిమిటేషన్ పై రేవంత్ ప్రతిపాదించిన హైబ్రిడ్ మోడల్ లో వచ్చే లోపాలను ఎత్తిచూపుతూ ఏపీ – తెలంగాణ విభజన పై విరుచుకుపడ్డారు.

అసలు ముఖ్యమంత్రి రేవంత్ కి ఈ హైబ్రిడ్ సలహా ఎవరిచ్చారో అంటూనే కాంగ్రెస్ విధానాలన్నీ కూడా ఇలానే అసంబద్డగా ఉంటాయని గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన విషయంలో కూడా కాంగ్రెస్ ఇష్టానుసారంగా వ్యవహరించిందంటూ ఆంధ్రప్రదేశ్ విభజనను బ్రిటిష్ హయాంలో జరిగిన ఇండియా – పాక్ విభజన తో పోల్చారు.

ADVERTISEMENT

అప్పట్లో జరిగిన దేశ విభజన ఇండియా – పాకిస్తాన్ విభజన కంటే దారుణంగా నాటి కాంగ్రెస్ ప్రభుత్వం అశాస్త్రీయంగా ఆంధ్రప్రదేశ్ ను ముక్కలు చేసిందని, ఆగాయాలు ఇప్పటికి ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను వెంటాడుతూనే ఉన్నాయంటూ తేజస్వి వివాదస్పద వ్యాఖ్యలు చేసారు.

దీనితో ఇక తెలంగాణ రాజకీయాలలో బీజేపీ పై రాజకీయ మంటలు చెలరేగుతున్నాయి. తెలంగాణ ఏర్పాటు పై బీజేపీ ఇప్పటికి తెలంగాణ మీద విషం చిమ్ముతూనే ఉందంటూ, ఒకవేళ ఆ సమయంలో బిఆర్ఎస్ ఎంపీ లు పార్లమెంట్ లో ఉండి ఉంటే తేజస్వి వ్యాఖ్యలకు సరైన బదులు చెప్పేవారంటూ హరీష్ తన స్వరం వినిపించారు.

ఇక అధికార కాంగ్రెస్ సైతం తేజస్వి వ్యాఖ్యలను తప్పుబడుతూ వెంటనే తేజస్వి తో సహా టి.బీజేపీ నేతలందరూ తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేసారు మంత్రి పొన్నం ప్రభాకర్. తేజస్వి రాష్ట్ర విభజన మీద ఇంత దారుణంగా మాట్లాడుతున్న సమయంలో సభలో ఉన్న టి. బీజేపీ నేతలెవ్వరూ తేజస్వి వ్యాఖ్యలను అడ్డుకోలేదని, ఖండించలేదంటూ కాంగ్రెస్ టి. బీజేపీ టార్గెట్ గా విమర్శలు గుప్పించింది.

ఇక ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కోసమే పార్టీ స్థాపించిన బిఆర్ఎస్ నుంచి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, జాగృతి అధ్యక్షురాలు కవిత కూడా నీకెంత ధైర్యం అంటూ తేజస్వి తన వ్యాఖ్యలకు వెంటనే తెలంగాణ సమాజానికి క్షమాపణలు చెప్పాలని, సదరు ఎంపీ ని బీజేపీ బర్తరఫ్ చెయ్యాలంటూ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

అయితే రాష్ట్ర విభజన జరిగి పుష్కర కాలం గడిచినా ఇంకా ఇలా ఎదో ఒక అంశంతో విభజన తీరు మీద ఎప్పుడో ఒకప్పుడు, ఎదో ఒక సందర్భంలో కాంగ్రెస్ విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తూనే ఉంది. ఇలా పార్టీల మధ్య జరుగుతున్న విభజన రాజకీయంతో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి అనవసరమైన ప్రాంతీయవాద చిచ్చు రేగుతుంది.

ఈ నీడలో ఏ పార్టీకాపార్టీ తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఈ వివాదాన్ని మరింత తీవ్ర తరం చేస్తూ రెండు తెలుగు రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతీస్తునే ఉంటాయి. ఏదిఏమైనా జరిగిపోయిన విభజన గురించి వాటి పర్యవసానాల గురించి ఇప్పుడు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకోవడం ఫలితంగా అటు ఏపీకి కానీ ఇటు తెలంగాణ కు వచ్చే ప్రయోజనం శూన్యమనే చెప్పాలి.

ADVERTISEMENT
Latest Stories