ఒక్కోసారి పీరియాడికల్, సోషియో ఫ్యాంటసీ, హర్రర్ కామెడీ… ఇలా ఒకే జోనర్లో వరుసగా సినిమాలు వస్తుంతుంటాయి. ఆ జోనర్లో ఒకటి సూపర్ హిట్ అయ్యింది కనుక మనమూ దాంతో హిట్ కొట్టొచ్చనే దర్శక, నిర్మాతల నమ్మకమే అందుకు కారణం.
తెలంగాణ రాజకీయాలలో ఇలాంటి జోనర్ ఒకటి గత ఏడాదే ప్రారంభం అయ్యింది. అదే పరువు నష్టం జోనర్.
ఈ జోనర్లో మంత్రి కొండా సురేఖకు ఒకేసారి రెండు హిట్స్ పడ్డాయి. ఒకటి అక్కినేని నాగార్జున ఇవ్వగా, మరొకటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ఇచ్చారు. ఇద్దరూ చెరో రూ.500 కోట్లు పరువు నష్టం దావా వేశారు. వాటిలో నాగార్జునకి నచ్చజెప్పుకొని కేసు వెనక్కు తీసుకునేలా చేశారు. కానీ కేటీఆర్తో కేసు నడుస్తూనే ఉంది.
ఆ తర్వాత కేంద్ర మంత్రి బండి సంజయ్పై కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు. కానీ బండి ముందుకు కదలలేదు. ఇటీవల హైదరాబాద్ బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫోన్ ట్యాపింగ్ కేసులో అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయనకు హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ నోటీస్ పంపారు.
దానికి ఆయన ‘తూచ్’ అంటూనే మళ్ళీ మీ గురించి నేనేమి తప్పు ఉద్దేశ్యంతో ఆ మాట అనలేదని ఈ కేసుకి ఫుల్ స్టాప్ బదులు కామా పెట్టారు.
వారిద్దరి మద్య ఈ గొడవ కొనసాగుతుండగానే, తీన్మార్ మల్లన్న కూడా విసి సజ్జనార్, తెలంగాణ పోలీస్ శాఖపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. కనుక ఆయనకీ విసి సజ్జనార్ ఓ నోటీస్ పంపించే అవకాశం ఉంది.
తాజాగా కేటీఆర్ మళ్ళీ బిజేపి ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అర్వింద్ ఇద్దరికీ లీగల్ నోటీసులు పంపారు. కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణకు హాజరైన తర్వాత దాని గురించి మాట్లాడుతూ, “నేను సినిమా హీరోయిన్ల ఫోన్లు ట్యాపింగ్ చేయించి వారిని లొంగదీసుకున్నానంటూ మీడియాలో కొందరు నా వ్యక్తిత్వహననానికి పాల్పడ్డారు. కానీ సిట్ విచారణలో నేను అటువంటి తప్పుడు పనులు చేయలేదని స్పష్టం చేశారు,” అని అన్నారు.
కానీ కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లా కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్లు జరిగాయని, సినిమా హీరోయిన్ల వ్యవహారం నిజమేనని బండి సంజయ్ అన్నారు. ఎంపీ ధర్మపురి అర్వింద్ కూడా ఇంచుమించు ఆవిధంగానే మాట్లాడారు. ఆయన మరికొన్ని తీవ్ర ఆరోపణలు కూడా జోడించారు. కనుక కేటీఆర్ వారిద్దరికీ లీగల్ నోటీసులు జారీ చేశారు. ఇద్దరికీ 5 రోజులు గడువు ఇచ్చారు. తర్వాత సివిల్, క్రిమినల్ కేసులు తప్పవని హెచ్చరించారు.
కానీ కేటీఆర్లాగే వారిద్దరూ తాటాకు చప్పుళ్ళకు భయపడేవారు కారు. కనుక పరువు నష్టం 2.0 తప్పకపోవచ్చు.
తాజాగా తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సింగరేణిలో రూ.1,600 కోట్లు విలువగల నైని బొగ్గుగనులు దక్కించుకోవడానికి పావులు కదిపారంటూ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వేమూరి రాధాకృష్ణ తొలి పలుకు పలికారు.
దానిపై భట్టి ఫెయిర్ అయ్యారు. కానీ సింగరేణి కధ ఒరిజినల్ తగ్గేదేలే… కావాలంటే కేసు వేసుకోవచ్చని వేమూరి రాధాకృష్ణ వీకెండ్లో చెప్పేశారు. ఈ సమాధానంతో మంత్రి భట్టి విక్రమార్క ఇగో ఇంకా దెబ్బ తింటుంది. కనుక ఇక్కడో పరువు నష్టం కేసుకి ఆస్కారం ఉందనిపిస్తోంది.
ఈవిధంగా తెలంగాణలో ఇంచుమించు ఒకే సమయంలో చాలా మంది పరువుకి భంగం కలుగుతోంది. కనుక ఎవరి పరువు ఎంతో తేల్చి చెప్పాల్సిన బాధ్యత హైకోర్టుదే!






