తెలంగాణలో ఎన్నికలలో ఏ పార్టీ గెలిస్తే మాకేమిటి… ఎవరు ముఖ్యమంత్రి అయితే మాకేమిటి? అని అంబటి రాంబాబు అని మేకపోతు గాంభీర్యం ప్రదర్శించినప్పటికీ తెలంగాణ ఎఫెక్ట్ మొదలైందని వైసీపిలో తాజా రాజీనామాలు నిరూపిస్తున్నాయి.
సిట్టింగ్ ఎమ్మెల్యేలను పెద్దగా మార్చకుండా కేసీఆర్ ఎన్నికలకు వెళితే తప్పకుండా గెలుస్తామనుకొని బోర్లా పడటంతో ఇప్పుడు ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి కూడా పునరాలోచనలో పడిన్నట్లు ఈ రాజీనామాలు సూచిస్తున్నాయి.
నిజానికి గత రెండేళ్లుగా ‘ఐప్యాక్’ ఈ ఎమ్మెల్యేలతో ఎన్నికలకు వెళితే ఓడిపోవడం ఖాయమని అలారం మ్రోగిస్తూనే ఉంది. దాంతో పనితీరు మెరుగుపరుచుకోవాలంటూ జగన్ పదేపదే హెచ్చరికలు చేయడం, గడపగడపకి పరుగులు పెట్టించడం అందరూ చూశారు.
ఆ తర్వాత జరిపిన సమీక్షా సమావేశాలలో కూడా జగన్ 30-40 మంది ఎమ్మెల్యేలకు క్లాస్ పీకిన్నట్లు వార్తలు వచ్చాయి. ‘ఆల్ ఈజ్ గోయింగ్ వెల్ ఇన్ వైసీపి’ అని జనాలను నమ్మించేందుకు నెమ్మదిగా పనితీరు బాగోలేని ఎమ్మెల్యేల సంఖ్యని 40 నుంచి 10-12కి కుదించుకొన్నారు. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత నలుగురిని, తాజాగా మరో ఇద్దరినీ సాగనంపుతున్నారు. అంటే ‘ఆల్ ఈజ్ నాట్ వెల్ ఇన్ వైసీపి’ అని అర్దమవుతోందన్న మాట!
సిట్టింగ్ ఎమ్మెల్యేలతో ఎన్నికలకు వెళ్ళి మంచాన్న పడిన కేసీఆర్ని చూస్తున్న జగన్ మళ్ళీ ఐప్యాక్ జాబితా బయటకు తీసి దుమ్ము దులపక తప్పదని, వైసీపిని గెలిపించుకోవాలంటే నిర్ధాక్షిణ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలను పీకి పక్కన పెట్టక తప్పదని గ్రహించిన్నట్లే అనిపిస్తోంది.
కనుక రెండేళ్ళకే నిర్ధాక్షిణ్యంగా మంత్రులను మాజీలను చేసేసినట్లు, ‘నువ్వే మా నమ్మకం జగన్’ అనుకొంటున్న వైసీపి ఎమ్మెల్యేలను కూడా మాజీలు చేయడం ఖాయంగానే కనిపిస్తోంది. కనుక వైసీపి ఎమ్మెల్యేలు తస్మాత్ జాగ్రత్త!
—




