అమీర్ పేట్ చౌరస్తాలో ఎన్టీఆర్ విగ్రహం పెట్టుకుందాం!

Telangana Leaders Revive Andhra Politics for Votes

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు భౌగోళికంగా విడిపోయినప్పటికీ రాజకీయంగా విడిపోలేకపోతున్నాయి. అది సాధ్యం కాదు కూడా! తెలంగాణలో బీఆర్ఎస్‌ పార్టీ తన ప్రత్యర్ధులపై రాజకీయంగా పైచేయి సాధించడానికి నీళ్ళు, సిఎం చంద్రబాబు నాయుడు పేరుతో సెంటిమెంట్ రాజకీయాలు చేస్తూనే ఉంది.

అంటే ఏపీని వ్యతిరేకిస్తూ దాని వలననే రాజకీయంగా లబ్ది పొందుతోందన్న మాట! ఒకరి సాయం తీసుకొని బాగుపడటం సర్వ సాధారణం. కానీ ఒకరిని ద్వేషిస్తూ లాభపడాలనుకోవడం చాలా నీచం. ఇది అప్రస్తుత చర్చ కనుక అసలు విషయానికి వద్దాం.

ADVERTISEMENT

తెలంగాణలో ముఖ్యంగా… హైదరాబాద్‌లో లక్షలాది మంది ఆంధ్రా ప్రజలు స్థిరపడి ఉన్నారు. కనుక ప్రతీ ఎన్నికలలో వారి ఓట్లు చాలా కీలకంగా మారుతుంటాయి.

ఇతర సమయాలలో ఆంధ్రాని, ఆంధ్రా పాలకులను, రాజకీయ నాయకులను బాహాటంగానే విమర్శించే తెలంగాణ నేతలు ఎన్నికలప్పుడు మాట మార్చి ఆంధ్రా ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు.

జగన్‌ ప్రభుత్వం చంద్రబాబు నాయుడుని అరెస్ట్‌ చేసి జైల్లో పెట్టినప్పుడు హైటెక్ సిటీలో ఐటి ఉద్యోగులు నిరసనలు తెలిపితే, మీ పంచాయితీలు ఇక్కడ కాదు. వెళ్ళి మీ రాష్ట్రంలోనే తేల్చుకోండి. శాంతి భద్రతలకు భంగం కలిగిస్తామంటే సహించమని మాజీ మంత్రి కేటీఆర్‌ అన్నారు. కానీ అదే కేటీఆర్‌ గత శాసనసభ ఎన్నికలప్పుడు ఖమ్మంలో శ్రీకృష్ణుడు రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరించారు!

ఆంధ్రా సరిహద్దులో ఉన్న ఖమ్మంలో ఆంధ్రా ప్రజలు, ముఖ్యంగా టీడీపి అభిమానులు చాలా మంది ఉన్నారు కనుకనే! కానీ వారందరూ కాంగ్రెస్‌ అభ్యర్ధి తుమ్మల నాగేశ్వర రావుకి ఓట్లు వేసి గెలిపించారు.

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలు నవంబర్‌ 11న జరుగబోతున్నాయి. కనుక సిఎం రేవంత్ రెడ్డి కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.

నిన్న బోరబండ, అమీర్ పేట్ తదితర ప్రాంతాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పుడు ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “అమీర్ పేట్ చౌరస్తాలో ఎన్టీఆర్ విగ్రహం పెట్టుకుందాం! ఆ పెద్దాయన విగ్రహం పెట్టుకుంటే ఎవరు అడ్దొస్తారో చూద్దాం…” అన్నారు.

రాష్ట్రం విడిపోయి 11 ఏళ్ళు అయినప్పటికీ, ఓసారి కృష్ణా గోదావరి, మరోసారి బనకచర్ల, మరోసారి చంద్రబాబు నాయుడు పేరు చెప్పుకుంటూ రాజకీయాలు చేసుకోవడం హాస్యాస్పదంగా ఉంది. ఇప్పుడు ఎన్నికల కోసం తెలంగాణ నాయకులు కూడా స్వర్గీయ నందమూరి తారక రామారావుని తలుచుకోవడం, ఆయన పేరు, విగ్రహాలతో ఓటర్లని ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తుండటం ఇంకా హాస్యాస్పదంగా ఉంది…. కదా?

ADVERTISEMENT
Latest Stories