దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు బీఆర్ఎస్ పార్టీ గడప వరకు వచ్చేసింది. కేసీఆర్ ముఖ్య అనుచరుడుగా భావిస్తున్న ఎమ్మెల్సీ నవీన్ రావు నేడు ఈ కేసులో సిట్ అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు.
సిట్ అధికారులు ఈ కేసులో ఇంతవరకు సంబంధిత అధికారులను, ఇతర పార్టీల సాక్షులకు నోటీసులు పంపించి వివరాలు సేకరించారు. తొలిసారిగా బీఆర్ఎస్ పార్టీలో ముఖ్య నేత నవీన్ రావుని నేడు ప్రశ్నిస్తుండటంతో, తర్వాత ఈ కేసులో కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్లకు నోటీసులు పంపడం ఖాయంగానే కనిపిస్తోంది.
కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటపెట్టినప్పుడు, కేసీఆర్ అదంతా ఉత్తి కట్టుకధే అని తేలికగా కొట్టిపడేశారు. ఒకవేళ రాష్ట్ర భద్రత కొరకు అధికారులు ఎవరైనా ఫోన్ ట్యాపింగ్ చేసి ఉంటే అందుకు వారే బాధ్యత వహించాలి తప్ప తనకు సంబంధం లేదన్నారు.
కానీ తన తండ్రి హయంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిన మాట వాస్తవమని ఆయన కూతురు కల్వకుంట్ల కవిత చెప్పారు. తన ఫోన్తో పాటు, తన భర్త అనిల్ కుమార్ ఫోన్ కూడా ట్యాపింగ్ చేయించారని కవిత ఆరోపించారు. కనుక ఈ కేసులో కేంద్రం జోక్యం చేసుకోకుండా దూరంగా ఉంటే ఇది కేసీఆర్ మెడకు చుట్టుకోవడం ఖాయంగానే కనిపిస్తోంది.






