మద్రాస్ నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ‘తెలుగువారు’ అనే గుర్తింపు ఏర్పడింది. ఆ తర్వాత సమైక్య రాష్ట్రంలో కూడా ఆంద్ర, తెలంగాణ, రాయలసీమ భావజాలం బలంగానే ఉండేది. కానీ అందరూ మాట్లాడేది తెలుగు భాషే.
ఏపీ, తెలంగాణ వేరు పడినప్పటికీ ప్రజలందరి భాష ఒక్కటే.. తెలుగు. యాసలు, ప్రాంతాలు వేరైనా అందరూ తెలుగువారే.
మన సంస్కృతీ, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలలో చిన్న చిన్న తేడాలు ఉన్న మాట నిజం. కానీ ఇంచుమించు ఒకేలా ఉంటాయి. కనుక మనమందరం ఆ తెలుగు తల్లి బిడ్డలమే అనే భావనతో నాడు తెలుగు తల్లి విగ్రహం ఏర్పాటు చేసుకున్నాము.
కానీ రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకు ‘వేరే తల్లి’ అవసరమని కేసీఆర్ భావించారు. కనుక ఏర్పాటు చేసుకున్నారు. ఒకవేళ తెలంగాణతో ఆంధ్రా కలిసి ఉండకపోయుంటే లేదా తెలంగాణ బదులు మరేదో రాష్ట్రం ఇలా తల్లిని ఏర్పాటు చేసుకుంటే తప్పు పట్టలేము కదా? కనుక కేసీఆర్ నిర్ణయం ఆంద్ర ప్రజల మనసులను నొప్పించినప్పటికీ తప్పుగా భావించలేదు.
అప్పటి నుంఛి తెలంగాణ ప్రజలు ఆమెను తల్లిగా భావిస్తున్నారు. కానీ ఆ తల్లిని కాంగ్రెస్ పార్టీ అంగీకరించలేదు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కొత్త రూపంతో మరో తెలంగాణ తల్లిని ఏర్పాటు చేశారు.
ఆ తల్లిని బీఆర్ఎస్ పార్టీ అంగీకరించడం లేదు! ఆమె మీ కాంగ్రెస్ తల్లి. మా తల్లి కాదంటున్నారు. మేము అధికారంలోకి వస్తే మీ తల్లి విగ్రహాలు పీకేస్తామని కేటీఆర్ హెచ్చరిస్తున్నారు.
నేటికీ ‘ఆంధ్రా’ అనే పదాన్ని కూడా ద్వేషిస్తున్న బీఆర్ఎస్ పార్టీ నేతలు, ఇప్పుడు కాంగ్రెస్ పాలనను, నిర్ణయాలను తప్పు పడుతున్నారు. కానీ తెలంగాణ తల్లి విషయంలో కూడా ఇలా పోరాడుకోవడం చూస్తున్నప్పుడు తెలంగాణ ప్రజలు బాధ కలుగుతుంది. కానీ ప్రజల మనోభావాలు పట్టించుకోకుండా తల్లి పేరుతో యుద్ధాలు చేసుకుంటున్నారు.
తెలంగాణ వేర్పడిన తర్వాత కనీసం తెలంగాణ తల్లి విషయంలో కూడా పార్టీల మద్య ఏకాభిప్రాయం లేకపోవడం చాలా శోచనీయమే!






