ఏపీ, తెలంగాణలు రాష్ట్రాలుగా విడిపోయినా అన్నదమ్ములా కలిసి ఉందామని చెప్పినవాళ్ళే ఈ 12 ఏళ్ళలో ప్రజలలో విద్వేష బీజాలు ఎంతగా నాటారో అర్థం చేసుకోవడానికి ‘ఇడుపు కాయితం’ సినిమా పేరుపై జరుగుతున్న చర్చలు, వివాదాలే తాజా ఉదాహరణ.
సోషల్ మీడియాలో ఇతరులను కించపరిచేలా మాట్లాడేవారు ఎప్పుడూ ఉంటారు. అటువంటివాళ్ళు ఏపీ, తెలంగాణలో రాజకీయ పార్టీలను, సినిమాలను, హీరో హీరోయిన్లను, దర్శకులను ఉద్దేశ్యించి నిత్యం వంకరటింకరగా కామెంట్స్ చేస్తూనే ఉంటారు.
అటువంటి కొందరి మాటలు పట్టుకొని తెలంగాణ భాష, యాసపై మళ్ళీ ఆంద్రావాళ్ళు దాడి చేస్తున్నారంటూ కొందరు వితండ వాదం చేస్తున్నారు.
ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు, మాజీ సిఎం జగన్మోహన్ రెడ్డి మాటలలో రాయలసీమ మాండలికం వినిపిస్తుంటుంది. అలాగే కేసీఆర్, రేవంత్ రెడ్డి తదితరుల నోట అచ్చ తెలంగాణ భాష యాస వినిపిస్తుంది. వాటిని అందరూ అంగీకరించి ఆస్వాదిస్తున్నారు.
తెలుగు సినిమాలలో తెలంగాణ, రాయలసీమ, గోదావరి జిల్లాలు, ఉత్తరాంద్రా ఇలా అనేక మాండలికాలతో తెలుగు భాషని ఆస్వాదిస్తుంటాము.
ఇతర భాషలను ముఖ్యంగా ఇంగ్లీష్, హిందీ, ఉర్దూలను అంగీకరించినప్పుడు తెలుగు భాషలో మాండలికాలను ఎందుకు అంగీకరించలేకపోతున్నాము?
నిజానికి ఒక్క తెలుగు భాషలో ఇన్ని యాసలు, మాండలికాలు ఉన్నందుకు మనం గర్వ పడాలి. కానీ ద్వేషించుకోవడం దేనికి?
అయినా తెలుగు భాష, ఈ మాండలికాల గురించి కనీసం అవగాహన లేని వారు సోషల్ మీడియాలో ఏదో వాగితే పట్టించుకోవాలా? ఆ పేరుతో రెండు రాష్ట్రాల ప్రజలు కీచులాడుకోవడం అవసరమా?
చద్దన్నం తిన్నమ్మకి మొగుడాకలి తెలియదన్నట్లు, రెక్కాడితే కానీ డొక్కాడని కష్ట జీవులకు ఈ భాష, మాండలికాలు, గొడవలు పట్టవు.
రాష్ట్రాలను, తెలుగు భాషని కాపాడే బాధ్యత తమపైనే ఉందనుకునే మేధావులతోనే అసలు సమస్య. అలాగని రాష్ట్రానికి, తెలుగు భాషకి ఏమైనా చేస్తున్నారా? అంటే సమాధానం ఉండదు. ఇలాంటి సందర్భాలలో మీడియా ముందుకు వచ్చి గలగలా మాట్లాడేస్తూ ఉంటారు. ఆ తర్వాత కనబడరు!




