రెండు రోజుల క్రితమే జనసేన నేతలు, కార్యకర్తలని గీత దాట వద్దని, దాటితే క్రమశిక్షణ చర్యలు తప్పవంటూ ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కి రాజకీయ కార్యదర్శి పి హరిప్రసాద్ సోషల్ మీడియాలో ఓ లేఖ ద్వారా హెచ్చరించారు.
తర్వాత సిఎం చంద్రబాబు నాయుడు కూడా వీడియో కాన్ఫరెన్స్లో పార్టీ ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ, క్రమశిక్షణ తప్పితే ఎమ్మెల్యేలను వదులుకోవడానికి వెనకాడనని, కనుక అనవసరమైన విషయాలలో తలదూర్చవద్దని హెచ్చరించారు.
ప్రతీ ఎమ్మెల్యేకి తన సమర్దత నిరూపించుకునేందుకు ఇది మంచి అవకాశమని దానిని వృధా చేసుకుంటే వన్-టైమ్ ఎమ్మెల్యేలుగా మిగిలిపోతారని సిఎం చంద్రబాబు నాయుడు తీవ్రంగా హెచ్చరించారు. ఈవిదంగా రెండు పార్టీలు తమ శ్రేణులను హెచ్చరించడాన్ని తేలికగా కొట్టి పడేయలేము.
జగన్ పాలనలో అనేక వేధింపులు భరిస్తూ ధైర్యంగా నిలబడి పోరాడిన టీడీపీ, జనసేన శ్రేణులకు, సహజంగానే వైసీపీపై ప్రతీకారం తీర్చుకోవాలని తహతహలాడుతుంటాయి.
కనుక వారు అటువంటి ప్రయత్నాలు చేస్తే తమ పార్టీలకు, ప్రభుత్వానికి కూడా చెడ్డపేరు వస్తుందని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గమనించడంతో పార్టీ శ్రేణులని ఈవిదంగా హెచ్చరించినట్లు భావించవచ్చు.
“జగన్ నన్ను జైల్లో పెట్టించాడని నేను కూడా అతనిని జైల్లో పెట్టాలనుకుంటే నాకు అతనికీ తేడా ఏముంటుంది?” అనే సిఎం చంద్రబాబు నాయుడు మాట పార్టీలో అందరికీ వర్తిస్తుంది కదా?
కనుక ఎమ్మెల్యేలందరూ ముఖ్యంగా.. తొలిసారిగా ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారు ప్రజలతో మమేకం అవుతూ వారి సమస్యలని తీర్చాలి తప్ప గర్వంతో విర్రవీగితే వన్-టైమ్ ఎమ్మెల్యేలుగా మిగిలిపోతారని, మరో ఛాన్స్ ఇవ్వనని సిఎం చంద్రబాబు నాయుడు చెప్పడం చాలా అభినందనీయం.
అధికారంలో ఉన్నప్పుడే కాదు.. లేనప్పుడు కూడా చెలరేగిపోతున్న వైసీపీ నేతలకు జగన్ ఏనాడూ ఈవిదంగా చెప్పలేదు.
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు “నేను బటన్ నొక్కుతాను మీరు ప్రజల వద్దకు వెళ్ళి డబ్బులు పడ్డాయని గుర్తుచేసి మనకే ఓట్లు వేయాలని చెపుతూ ఉండండి,” అని మంత్రులు, ఎమ్మెల్యేలకు చెపుతుండవారు. ఇప్పుడు ఆయన సొంత న్యూస్ ఛానల్ సాక్షిలోనే ‘అమరావతి వేశ్యల రాజధాని’ అని చెప్పించారు.
చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లకు జగన్మోహన్ రెడ్డికి అలాగే వారి పార్టీలకు తేడా ఇదే!




